Jul 21,2022 22:02

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: అనుమతులు లేకుండా నడుస్తున్న సత్యనారాయణపురంలోని నెల్లూరు రవీంద్రభారతి స్కూల్‌గుర్తింపు రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం సత్యనారాయణపురంలోని నెల్లూరు రవీంధ్రభారతి స్కూల్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేట్‌ విద్యా సంస్థలు నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. విద్యార్థుల వద్ద నుండి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నా వారికి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా ఉన్న పాఠశాల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో ఏదైనా ప్రమాదం జరిగితే విద్యార్థులకు కనీస భద్రత కూడా లేదని అన్నారు. ప్రభుత్వం నిర్థేశించిన ఫీజులను వసూలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లక్ష్మీరెడ్డి, రిజ్వాన్‌, మన్మధ, శివ, టి.ప్రవీణ్‌, డివైఎఫ్‌ఐ సిటీ నాయకులు ఎస్‌కె నిజాముద్దీన్‌, పండు పాల్గొన్నారు.