పాఠశాలలో ఎంఇఒ తనిఖీ
ప్రజాశక్తి-ఉదయగిరి : దుర్గంపల్లి ఎంపిపిఎస్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న ఎఫ్ఎ-3, క్లాస్ రూమ్ బేసిడ్ అసెస్మెంట్-2 పరీక్షలను మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్వలీ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పాఠశాలలో నిర్వహిస్తున్న ఎఫ్ఎ-3, క్లాస్రూమ్ బేసిడ్ అసెస్మెంట్-2 జరుగుతున్న విధానాన్ని పరిశీలించామని అలాగే ఒఎంఆర్ ఆన్సర్ షీట్ను విద్యార్థులతో పూర్తి చేయించాలని ఎవరైనా పూర్తి చేయలేని విద్యార్థులు ఉంటే వాటిని ఉపాధ్యాయులు దగ్గరుండి పూర్తి చేయించాలని పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థుల ఉపాధ్యాయుల మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఆయాల హాజరు పట్టిలను, మధ్యాహ్నం భోజన రికార్డులను, సిసిఇ రిజిస్టర్లను పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని రుచి చూశారు. సొంత పిల్లలకు ఎంత రుచి శుచికరంగా తయారు చేసుకుంటామో అంతే రుచి శుచికరంగా విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించి మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజు మెనూప్రకారం అందించాలని నిర్వాహకులకు ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్.కె.జాఫర్మోదీన్, ఉపాధ్యాయులు వెంకటరెడ్డి పాల్గొన్నారు.










