Jul 26,2021 21:27

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులపై సిబిఎఎస్‌ కత్తి వేలాడుతోంది. దాదాపు 20 నుంచి 22 నెలలుగా పనిచేస్తున్న వారికి సిబిఎఎస్‌ (క్రెడిట్‌ బేస్‌డ్‌ అసెస్‌మెంట్‌ సిస్టమ్‌) పరీక్ష నిర్వహించి అందులో కనీస అర్హత సాధించిన వారినే రెగ్యులర్‌ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం...  ఆ విధి విధానాలను వెల్లడించింది. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో కనీసం 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. పేపర్‌-1లో 26 మార్కులు, పేపర్‌-2లో 14 మార్కులు సాధించాలి. అప్పుడే రెగ్యులర్‌ చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
గామ్ర, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటుచేసిన సమయంలో రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో ఉంటాంని, ఆ తరువాత ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రెగ్యులర్‌ అవుతారని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు సిబిఎఎస్‌ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే రెగ్యులర్‌ చేస్తామని చెప్పడంతో కార్యదర్శులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రక్షణ విభాగం చూసే కార్యదర్శులను మహిళ పోలీస్‌గా మార్చగా, తాజాగా సిబిఎఎస్‌ పరీక్ష మరింత గందరగోళంలోకి నెట్టేసే పరిస్థితి కనిపిస్తోంది.
తాజా సర్క్యులర్‌లో పరీక్ష విధానాన్ని స్పష్టం చేశారు. తొలి పేపర్‌ను 65 మార్కులకు నిర్వహించాలని, అందులో 26 మార్కులు అర్హతగా ఉంటాయని వెల్లడించారు. పేపర్‌-1లో ప్రస్తుతం కార్యదర్శి ఏ విభాగానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఆ విభాగానికి సంబంధించి 50 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం 20 మార్కులు రావాల్సి ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, సచివాలయాల సేవలకు సంబంధించి 15 మార్కులు ఉంటాయి. ఇందులో కనీసం ఆరు మార్కులు రావాలి. పేపర్‌-2లో మొత్తం 35 మార్కులకుగాను తొలి 15 మార్కులకు సంబంధించి కఠినమైన సిలబస్‌ ఉంటుంది. ఎపి సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌, ఎపి సివిల్‌ సర్వీస్‌ నిబంధనలు, లీవ్‌ రూల్స్‌, ప్రాధమిక నిబంధనలు, ఇతర రూల్స్‌, కోడ్‌, మాన్యువల్స్‌పై ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఆరు కనీసంగా మార్కులు రావాల్సి ఉంటుంది. ఇక మిగిలిన 20 మార్కులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్‌పై అవగాహన, కమ్యూనికేషల్‌ స్కిల్స్‌, నాయకత్వ లక్షణాలపై ప్రశ్నలు ఉంటాయి. వీటిల్లో ఎనిమిది మార్కులు సాధిస్తే అర్హులుగా ఉంటారు.
పరీక్షల్లో తొలి పేపర్‌ విడివిడిగా తయారుచేసేలా, రెండో పేపర్‌ మాత్రం అందరికీ ఒకేలా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. నాయకత్వ లక్షణాలకు సంబంధించి ప్రవర్తన, ఉన్నతాధికారులతో ఎలా వ్యవహరించాలి, ప్రజలతో ఎలా ఉండాలి అన్న అంశాలతోపాటు వస్త్రధారణ, ఆకట్టుకునే విధం వంటి అంశాలపైనా ప్రశ్నలు ఉంటాయి. లక్ష్యాలకోసం పనిచేసే విధానం, ఒత్తిడిని అధిగమించడం, మీడియా, పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌, నూతన ఆలోచనా విధానంపైనా సిలబస్‌ ఉంటుంది.


సిబిఎఎస్‌ పరీక్షలో మార్కుల విధానం

--------------------------------------------------------------------------
పేపర్‌          మొత్తం         సబ్జక్ట్‌                                     అర్హత మార్కులు
               మార్కులు

--------------------------------------------------------------------------
1             65             ఎ. శాఖాపరమైన అంశాలు              20
                               బి. ప్రభుత్వ పథకాలు                    6
2             35             సి. సర్వీస్‌ రూల్స్‌                        6
                               డి. సాంకేతిక, కంప్యూటర్‌ స్కిల్స్‌         4

                               ఇ. నాయకత్వ, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌   4