ప్రజాశక్తి - పరిగి : కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రంరాజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం పరిగి మండలం సేవమందిర్లోని కేటీ శ్రీధర్ నివాసంలో నియోజకవర్గస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న గిడుగు రుద్రంరాజు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి వారిద్వారా మండల, గ్రామీణ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కమిటీలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 శాతం పోస్టులు కేటాయించినట్లు వెల్లడించారు. పార్టీ ద్వారా కేటాయించే పోస్టులు 50 శాతం యువతకే ఇవ్వనన్నట్లు చెప్పారు. నాయకులు మాస్ కాంటాక్ట్ పోగ్రాంకు శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం ద్వారా ఎన్జీవోలు, సంక్షేమ సంఘాల సభ్యులతో చర్చించి వారిని పార్టీలోకి తీసుకురావాలని కోరారు. పార్టీని వీడి ఇతర పార్టీలో చేరిన వారి గుర్తించి రాబోయే రోజుల్లో పార్టీ తీసుకొస్తున్న కార్యక్రమాలను సంక్షేమ పథకాలను తెలియజేసే మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని కోరారు. నాయకులు ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పనిచేయాలని కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఇటీవలే కాశీ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ తలపెట్టిన జూడో యాత్ర విజయవంతమై కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి బాగా పనిచేస్తుందని అన్నారు. ఈ పాదయాత్ర ఒక చరిత్ర అని ఆయన అన్నారు. అనంతరం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకుని ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎఐసిసి సెక్రటరీ మయ్యప్పన్ను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, కోఆర్డినేటర్ సభ్యులు శ్రీరామమూర్తి, జిల్లా అధ్యక్షులు సుధాకర్, ఎఐసిసి మెంబర్ కెటి శ్రీధర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాకేశంకర్, ఎన్ఎస్యుఐ నాగమధు, యూత్ కాంగ్రెస్ రామారావు, కోటా సత్యం తదితరులు పాల్గొన్నారు.










