రాయచోటి టౌన్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి జగన్ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. పట్టణంలోని గాలివీడు రింగ్ రోడ్డు-కడప బైపాస్ రహదారిలో కర్నూలు మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో విజయ పాల డెయిరీని కర్నూలు మిల్క్ యూనియన్ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డితో కలసి శ్రీకాంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశ్యంతో పాల ఉత్పత్తుల పెంపుదలకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో పశువ్యాధి నిర్దారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. పాల డెయిరీ అభివద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. డెయిరీ నిర్వాహకులు క్రమం తప్పకుండా రైతులుకు పాల బిల్లులు చెల్లించాలని, రైతులను ప్రోత్సాహించాలన్నారు. అమూల్, విజయ డెయిరీల ఏర్పాటుతో రైతులకు మంచి పాల రేట్లు వచ్చాయని తెలిపారు. కర్నూలు మిల్క్ యూనియన్ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి పాడి రైతుకు ఒక లీటరుకు రూ.3 చొప్పున బోనస్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కర్నూలు మిల్క్ యూనియన్ ఎమ్డి ప్రదీప్ కుమార్, డిడి నాగరాజేష్, అర్బన్ సిఐ సుధాకర్రెడ్డి, వైసిపి నాయకులు రియాజ్, ప్లాంట్ ఇన్ఛార్జి శ్రీనివాస కుమార్, ఫీల్డ్ ఇన్ఛార్జి బాల సుబ్బయ్య పాల్గొన్నారు.










