Jul 22,2021 18:54

నెల్లూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సోనూసూద్‌ ఫౌండేషన్‌ సహకారంతో నెలకొల్పిన ఆక్సిజన్‌ ప్లాంట్‌ను శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాంట్‌ను నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్‌ స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంతకీ ఎవరీ నాగలక్ష్మి అనుకుంటున్నారా..? నెల్లూరు జిల్లా కావలికి చెందిన బొడ్డు నాగలక్ష్మి గురించి రెండు నెలల క్రితం వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆమె సేవా గుణం గురించి సోనూసూద్‌ చేసిన ట్వీట్‌తో దేశమంతా గుర్తింపు పొందారు. నాగలక్ష్మి పుట్టుకతోనే అంధురాలు. కరోనా సమయంలో ప్రజలకు సోనూసూద్‌ సాయం అందించడం నాగలక్ష్మిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే తన ఐదు నెలల ఫించన్‌ రూ.15 వేలను సోనూసూద్‌ ఫౌండేషన్‌కు అందించింది. దీంతో 'దేశంలో నాగలక్ష్మి కంటే గొప్ప ధనవంతులెవరూ లేరు' అంటూ ఆప్పట్లో సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్‌ ప్లాంట్‌ను అదే జిల్లాకు చెందిన నాగలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సోనూసూద్‌ నిర్ణయించారు. ''ఆక్సిజన్‌ ప్లాంట్‌ను అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, కలెక్టర్‌ చక్రధర్‌బాబుతో కలిసి నాగలక్ష్మి ప్రారంభిస్తుండడం మనందరికీ గర్వకారణం'' అంటూ సోనూసూద్‌ తాజాగా ట్వీట్‌ చేశారు.