Mar 09,2022 07:52
  • గృహ విద్యుత్‌ వినియోగదారులకు నోటీసులు
  • నెల రోజుల్లో చెల్లించకపోతే కనెక్షన్‌ కట్‌

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : గృహ విద్యుత్‌ వినియోగదారులపై సర్కారు మరో భారాన్ని మోపుతోంది. ఓవర్‌ లోడ్‌ పేరుతో డబ్బులు వసూలు చేయడం కోసం ఎపి ఎస్‌పిడిసిఎల్‌ నోటీసులు జారీ చేసింది. కనెక్షన్‌ తీసుకునే సమయంలో వారి ఇంటిలో విద్యుత్తు వినియోగ అంచనాను బట్టి లెక్కించిన లోడ్‌ను అధికారులు నిర్ణయిస్తుంటారు. దాన్నిబట్టి డెవలప్‌మెంట్‌ చార్జి నిర్ణయిస్తారు. అయితే, కాలక్రమంలో అనేక ఇళ్లలో కుటుంబ అవసరాలు పెరగడం, ఆధునిక ఉపకరణాల వినియోగం పెరిగింది. దాంతో మీరు అనుమతి పొందిన లోడ్‌కన్నా అధికంగా విద్యుత్తును వాడుతున్నారంటూ వినియోగదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నెల రోజుల్లోగా ఓవర్‌లోడ్‌ బట్టి చార్జీ చెల్లించాలని, లేదా అదనపు ఉపకరణాలు (లోడ్‌) తొలగించాలని, అలా జరగకపోతే 30 రోజుల తరువాత ఎలాంటి నోటీసు లేకుండా కనెక్షన్‌ కట్‌ చేస్తామని ఈ తాఖీదుల్లో పేర్కొన్నారు. ఈ వడ్డన కోసమే విద్యుత్‌ ఉద్యోగులు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారని గత జూలై నెలలోనే ప్రజాశక్తి కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది.

ddd


    కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2,966 మందికి ఓవర్‌లోడ్‌ నోటీసులు జారీ అయ్యాయి. వీరిలో కర్నూలు టౌన్‌ డివిజన్‌ పరిధిలో 321 మంది, కర్నూలు రూరల్‌ డివిజన్‌ పరిధిలో 332 మంది, డోన్‌ డివిజన్‌ పరిధిలో 517 మంది, నంద్యాల డివిజన్‌ పరిధిలో 1,153 మంది, ఆదోని డివిజన్‌ పరిధిలో 643 మంది ఉన్నారు. లోడ్‌కు మించి విద్యుత్తును వినియోగిస్తున్నారని, ఒక కిలోవాట్‌కు రూ.1,868 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. డెవలప్‌మెంట్‌ ఛార్జి రూ.1,500, ఎస్‌డి రూ.200, సూపర్‌విజన్‌ ఛార్జి రూ.100, దరఖాస్తు ఫీజు రూ.50, జిఎస్‌టి రూ.18గా నిర్ణయించారు. దీనిపై వినియోగదారులకు కనీస అవగాహన కూడా లేదు. క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించకుండానే ఓవర్‌ లోడ్‌ పేరుతో నోటీసులు జారీ చేస్తుండడం పట్ల వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి అవసరాలను బట్టి విద్యుత్‌ ఉపకరణాలు వినియోగించడం సహజమని, అలాగే సిఎఫ్‌ఎల్‌ బల్బులవంటివి వినియోగించడంవల్ల ఆ లోడ్‌ తగ్గిందనీ ఇలాంటివాటికి కూడా నోటీసులు జారీ చేసి, వేధించడం సమంజసం కాదని అంటున్నారు.

                                                                      వినియోగాన్ని బట్టే నోటీసులు

'ఓవర్‌లోడ్‌' వడ్డన

విద్యుత్తు వినియోగాన్ని బట్టే ఓవర్‌ లోడ్‌ నోటీసులు జారీ చేశాం. ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. కనెక్షన్‌ తీసుకున్న సమయంలో అనుమతి ఇచ్చిన లోడ్‌కంటే ప్రస్తుతం ఎక్కువ లోడ్‌ను వినియోగిస్తే అదనపు డబ్బు చెల్లించి లోడ్‌ను పెంచుకోవాలి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
                                                                     - కె.శివ ప్రసాద్‌ రెడ్డి,
                                                           ఎపిఎస్‌పిడిసిఎల్‌ ఎస్‌ఇ, కర్నూలు