Jul 27,2021 11:59

ఇంటర్నెట్‌ డెస్క్‌ : తమిళ సినీ కార్మికులని ఆదుకోవాలనే లక్ష్యంతో అగ్ర కథా నాయక, నాయికలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'నవరస' అనే ఓ వెబ్‌సిరీస్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పేరుకి తగ్గట్టుగా.. ఈ సిరీస్‌లో శాంతం, కరుణ, రౌద్రం, భయానకం.. ఇలా నవరసాలు ఇందులో ఉన్నాయి. ఈ సిరీస్‌లో ప్రముఖ హీరోలు సూర్య, సిద్దార్థ్‌, ప్రకాశ్‌రాజ్‌, విజరుసేతుపతి, రేవతి, ఐశ్వర్యరాజేష్‌, అరవింద్‌స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు, అంజలి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్‌లో నేపథ్య సంగీతానికి తగ్గట్టుగా.. అగ్రతారలందరూ.. ఒకే వీడియోలో ఒకేసారి కనిపించి కన్నులవిందు చేశారు. ఒక్కోక్కరు వారి వారి పాత్రల్లో ఇమిడిపోయారనిపిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌ చిత్రకరణ పూర్తి చేసుకుందని సమాచారం. ఆగస్టు 6వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.
ఇక ఈ సిరీస్‌ని మణిరత్నం మరో దర్శకుడు జయేంద్రతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సిరీస్‌లో ఒక్కో భాగాన్ని ఒక్కో దర్శకుడు తెరకెక్కించడం విశేషం. రతీందన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌స్వామి, బిజోరు నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సుర్జన్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఇలా తొమ్మిది మంది దర్శకులు.. తొమ్మిది కథలకి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ తొమ్మిది భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది.

ట్రైలర్‌ మీరూ చూసేయండి : https://youtu.be/Go6O1wX8H-c