రాయచోటి : కడప-రేణిగుంట జాతీయ రహదారి-716 కు సంబంధించి నిర్వా సితులకు భూపరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ గిరీష పి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్ట రట్లో కడప - రేణిగుంట జాతీయ రహదారి 716 నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీ అంశంపై జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్తో కలిసి తహశీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఎ న్ హెచ్ 716కు సంబంధించి మొత్తం 692.5 ఎకరాలు సేకరించామన్నారు. ఇందులో ఇప్పటివరకు 1470 మంది నిర్వాసితులకు రూ.63.42 కోట్లు చెల్లించారన్నారు. ఇంకనూ 585 మందికి దాదాపు రూ.31 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో జిల్లాకు సంబంధించి రాజంపేట, నందలూరు, పుల్లంపేట, రైల్వే కోడూరు, ఓబులవారిపల్లిలలో మండలాల వారీగా ఎన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి, ఎంత చెల్లింపులు చేయాల్సి ఉందన్న అంశంలో ఆయా తహశీల్దార్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే రెండు వారాల్లోగా 80 శాతం మేర చెల్లింపులు పూర్తి చేయాలని ఆదేశించారు. భూములకు సంబంధించి కోర్టులో కేసులుంటే ఆ సర్వే నంబర్లకు సంబంధించిన డబ్బు కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించారు. సేకరించిన భూమిలో ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే వాటిని గుర్తించి త్వరితగతిన ఫైనలైజ్ చేయాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. రైల్వే , అటవీ పోరంబోకు భూముల విషయంలో మార్గదర్శకాలను పక్కగా పాటించాలన్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్ట్రక్చర్స్ ఉంటే ఆ వివరాలను కలెక్టరేట్ కు పంపాలని తహశీల్దార్ల సూచించారు. ఏ అవార్డుకు ఎంత నగదు చెల్లింపు చేశారన్న వివరాలను పక్కగా నమోదు చేయాలన్నారు. జెడ్హెచ్డిసి భూములకు సంబంధించి మార్గదర్శకాలను పక్కాగా పాటించాలన్నారు. సబ్ డివిజన్ చేసి ప్రొసిడింగ్స్ ఇవ్వాలని పేర్కొన్నారు. వాగులు, వంకలకు సంబంధించి సంబంధిత శాఖ నుంచి ఎన్ఒసి తీసుకోవాలన్నారు. పరిహారం సొమ్మును త్వరితగతిన చెల్లింపు చేసి ఎన్హెచ్ 716 జాతీయ రహదారి నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో డిఆర్ఒ సత్యనారాయణ, ఎన్ హెచ్ డిప్యూటీ మేనేజర్ వెంకటరమణ, రాజంపేట డివిజన్ తహశీల్దార్లు పాల్గొన్నారు.










