నిందితులపై కేసులు నమోదు చేయరా
- డిఎస్పిని ప్రశ్నించిన టిడిపి నేతలు
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గంలో దళితులపై జరుగుతున్న అన్యాయాల గురించి కావలి డిఎస్పి కార్యాలయంలో మంగళవారం డిఎస్పి వెంకటరమణను మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎంఎల్సి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంఎల్ఎ పాశం సునీల్కుమార్, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు జెన్ని రమణయ్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు కలసి ప్రశ్నించారు. దగదర్తి మండలం, ఉలవపాడు పెట్రోల్ బంకు వద్ద జరిగిన సంఘటన అందరికీ తెలుసని, తేజపై దాడి చేసిన వారిపై ఎందుకు 307 కేసు నమోదు చేసి, అరెస్టు చేయ లేదని టిడిపి నేతలు ప్రశ్నించారు. అదేవిధంగా కడనూతల గ్రామానికి చెందిన పైడి హర్ష చెన్నరులోని అపోలో హాస్పటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడని, అతని ఆత్మహత్యాయత్నానికి గురిచేసిన వారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇలా ఎంతమంది దళితులను పొట్టనపెట్టుకుంటారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి కారకులైన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.










