May 03,2022 08:29
  • ఒక్కసారిగా కిలో రూ.వంద నుంచి రూ.30కు పతనం
  • వ్యాపారులు సిండికేట్‌
  • కౌలు రైతులకు తీవ్ర నష్టం

ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఇటీవల వరకూ ఆశాజనకంగా ఉన్న నిమ్మ ధర ప్రస్తుతం ఒక్కసారిగా పడిపోయింది. మార్చిలో కిలో రూ.180 పలికిన నిమ్మ... ఏప్రిల్‌లో రూ.వందకు తగ్గి ఇప్పుడు ఏకంగా కిలో రూ.30కు పతనం కావడంపై రైతులు లబోదిబోమంటున్నారు. పంట మార్కెట్‌కు వచ్చే సమయంలో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి నిమ్మ ధర తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గిపోయిందని, ధర సైతం తగ్గిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని ఘొల్లుమంటు న్నారు. ముఖ్యంగా కౌలు రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు.జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో రైతులు నిమ్మ సాగు చేస్తున్నారు.
      ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏలూరు, దెందులూరు, గోపాలపురం, జంగారెడ్డిగూడెంలో నిమ్మ మార్కెట్లు ఉన్నాయి. సీజన్‌లో రోజుకు 200 లారీల వరకూ నిమ్మ ఎగుమతి జరుగుతుంది. ధర నిలకడగా ఉండడం లేదు. పంట మార్కెట్లోకి రానప్పుడు ధర ఎక్కువగా ఉంటోంది. పంట మార్కెట్‌కు వచ్చేసరికి వ్యాపారులు సిండికెట్‌గా ఏర్పడి ధర భారీగా తగ్గించేస్తున్నారు.
 

                                                           పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి

పరిస్థితులు అనుకూలిస్తే ఎకరాకు వంద నుంచి 150 బస్తాల వరకూ నిమ్మ దిగుబడి వస్తుంది. 50 కిలోలను ఒక బస్తాగా పరిగణిస్తారు. అక్టోబర్‌, నవంబర్‌, మార్చి, ఏప్రిల్‌, మే నెలలు ఈ పంటకు సీజన్‌ సమయం. ఈ ఏడాడి నిమ్మ తోటలకు తెగుళ్లు సోకడంతో కాపు తగ్గిపోయింది. ఎకరాకు 20 నుంచి 50 బస్తాలలోపే దిగుబడి వస్తోంది. నిమ్మతోటకు ఎకరం ఒక్కంటికీ ఏడాదికి రూ.50 వేల కౌలు చెల్లించవలసి ఉంటుంది. ఎకరాకు రూ.50 వేలు వరకూ పెట్టుబడి అవుతుంది. అంటే కౌలు రైతులకు దాదాపు రూ.లక్ష వరకూ ఖర్చవుతుంది. ఈ ఏడాది నిమ్మ దిగుబడి తగ్గినా మొదట్లో ధర బాగుండడంతో రైతులు ఆనందపడ్డారు. ప్రసుత్తం వారి ఆనందర ఆవిరైంది. ధర ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉందని రైతులు చెబుతున్నారు. దిగుబడి ఉంటే ప్రస్తుత ధరతో కొంతైనా బయట పడేవారు. దిగుబడి తగ్గడం, ధర తగ్గడంతో ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
 

                                                          మార్కెట్లో డజను నిమ్మ రూ.వంద

ధర అమాంతం తగ్గించి రైతుల నుంచి నిమ్మ పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో మాత్రం నిమ్మ ధర ఏ మాత్రమూ తగ్గలేదు. డజను నిమ్మకాయలను సోమవారం రూ.వందకు విక్రయించారు. రైతులు, వినియోగదారులు నష్టపోతుండగా దళారులు భారీగా లాభపడుతున్నారు.