మున్సిపల్ చైర్పర్సన్ ముందు సమస్యను వివరిస్తున్న రహమత్పురం మహిళలు
హిందూపురం: పురపాలక సంఘంలోని రహమత్పురం ప్రాంతంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత మహిళలు మున్సిపల్ ఛైర్పర్సన్ ఇంద్రజ ముందు వాపోయారు. శనివారం ఛైర్పర్సన్ ఛాంబర్లో ఆమెను కలిసి సమస్యను వివరించారు. గత 15 రోజులుగా నీళ్లు రావాడం లేదని, అడిగితే ఆ ప్రాంతానికి చెందిన వాటర్ మ్యాన్ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోవాలని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుంచి కదలమని చెప్పారు. ఇదే విషయంపై 15వ వార్డు కౌన్సిలర్ షాజియా రహమత్పురం ప్రాంతంలో పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని లిఖిత పూర్వకంగా కోరారు. దీనిపై స్పందించిన ఛైర్పర్సన్ వెంటనే ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.










