ఎర్రగుంట్ల : 'నేను ఎవరితోనూ కుమ్మక్కై డబ్బులు తీసుకోలేదని' వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన డ్రైవర్ దస్తగిరి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను కుమ్మక్కు అయినట్లు నిరూపిస్తే జీవితాంతం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, లేనిపక్షంలో మీరు పార్టీని, పదవులను వదలుకుని జైలుకు వెళ్లే శక్తి ఉందా అని సవాల్ విసిరారు. సిబిఐ సరైన కోణంలో వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తోందన్నారు. గతంలో ఉన్న సిబిఐ అధికారి రాంసింగ్, తాజా అధికారి ఇద్దరూ ఒకే దారిలో వెళ్తున్నారంటే నూటికి వెయ్యి పాళ్లు సరైన కోణంలోనే విచారణ సాగుతోందన్నారు. ఎంపీ చెప్పినా, మరొకరు చెప్పినా న్యాయమే గెలవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అఫ్రూవర్గా మారకముందు దస్తగిరి అంటే ఇష్టమని, వాంగ్మూలం ఇచ్చిన అనంతరం చెడ్డవాడు కావడమా అని ప్రశ్నించారు. మీరు చెప్పినట్లే లెటర్ తదితర ప్రాసెస్ సాగించామని తెలిపారు. గతంలో తనకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్లతో ప్రాణహాని ఉందని ఆరోపించానని, తాజాగానూ అదే చెబుతున్నానని తెలిపారు. రెండు నెలలు కంతు కట్టలేదనే నెపంతో తన వాహనాన్ని ఫైనాన్స్ వాళ్లు వేధించడంలోని మతలబు ఏమిటని ప్రశ్నించారు.










