
నేడు, రేపు సచివాలయ ఉద్యోగుల పరిజ్ఞాన పరీక్షలు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: ఈనెల 14,15 తేదీలో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిచే సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలు నిర్వహించనున్నారని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ సూచించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి సమావేశమయ్యారు. డిఆర్ఓ మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం దగ్గరలో గల ఏఐఎం టెక్నాలజీస్ కేంద్రంగా రెండు రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలు ఉంటాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. అర్థగంట పాటు 4 సెషన్స్లో ఈ పరీక్షలు ఉంటాయని 651 మందికి ఉదయం ఉ 9.30 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 12.30 గంటల వరకు, 2 నుంచి 2.30 గంటల వరకు, సాయంతం 5 నుంచి 5.30 గంటల మధ్య నిర్వహించనున్నామని పరీక్షల సమయాలలో విద్యుత్శాఖ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులకు రవాణా సౌకర్యం ఏర్పాట్లు ఏపీఎస్ఆర్టీసీ చూడాల్సి ఉంటుందని అందుకు సంబంధించి సెంట్రల్ బస్స్టేషన్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వైద్యశాఖ మెడికల్ క్యాంపు, పంచాయతీ రాజ్ శాఖ తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపారు. నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. ఈసమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు వెంకటరమణ, శేఖర్, విధులు కేటాయించిన లైసెన్ ఆఫీసర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.