నాణ్యమైన భోజనాన్ని అందించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఎంఇఒ షేక్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని కృష్ణంపల్లి జెడ్పి హైస్కూల్ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న సంగ్రహణాత్మక పరీక్షల విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయా పాఠశాలల్లో జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తరగతి నుండి 8వ తరగతి అభ్యసించే విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో ప్రశ్నాపత్రాలు ఇవ్వాలని విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాసే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని రుచి చూస్తూ మధ్యాహ్న భోజనం తయారు చేయుటలో నాణ్యత పాటిస్తూ ప్రతిరోజు మెనూ ప్రకారం రుచి శుచికరంగా ఉండే విధంగా చూడాలని ప్రధాన ఉపాధ్యాయులకు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. ఆయాలు ప్రభుత్వం అందించిన రసాయనాలు క్లీనింగ్ టూల్స్ను ప్రతిరోజు వినియోగిస్తూ తరగతిగదులు మరుగుదొడ్లు, పాఠశాల ఆవరణమును శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిఆర్పిలు పాల్గొన్నారు.










