Jul 13,2023 12:28

వెస్టిండీస్‌, టీమిండియా మధ్య బుధవారం మొదలైన తొలి టెస్టులో విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్‌ ఐదు వికెట్లు.. జడ్డూ మూడు వికెట్లు తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 40, రోహిత్‌ శర్మ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 70 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఒకే వికెట్‌ తీసినా తన సూపర్‌ ఫీల్డింగ్‌తో అతను వార్తల్లో నిలిచాడు. ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టాడు. 28వ ఓవర్‌లో జడేజా వేసిన బంతిని జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌ మిడాఫ్‌ దిశగా గాల్లోకి లేపాడు. దూరం నుంచి పరుగెత్తుకు వచ్చిన సిరాజ్‌ గాల్లోకి అమాంతం ఎగిరి సింగిల్‌ హ్యాండ్‌తో అద్భుతమైన రీతిలో క్యాచ్‌ పట్టాడు. బంతిని అందుకున్న తర్వాత బ్యాలెన్స్‌ కోల్పోయిన అతను కింద పడగా.. మోచేతికి చిన్న గాయం కూడా అయింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.