May 08,2022 08:32

ముంబయి : మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మోసాలు బయటపడుతున్నాయి. తాజాగా యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలింది. మార్కెట్‌ ధరలకంటే షేర్లకు అధిక బిడ్లను వేయడం, బ్రోకర్ల నుంచి ప్రోత్సాహకాల రూపంలో నగదు అందుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడిన యాక్సిస్‌ ఎంఎఫ్‌లోని ఇద్దరు మేనేజర్లను సస్పెండ్‌ చేశారు. ఎంఎఫ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. విరేష్‌ జోషి, దీపక్‌ అగర్వాల్‌ 'ఫ్రంట్‌ రన్నింగ్‌' ద్వారా మోసాలకు పాల్పడుతూ భారీగా లాభాలు పొందారు. భవిష్యత్తు లావాదేవీ గురించి అంతర్గత పరిజ్ఞానం కలిగి బ్రోకర్‌ ద్వారా ట్రేడింగ్‌ స్టాక్‌ లేదా ఏదైనా ఇతర ఆర్థిక ఆస్తి ధరను గణనీయంగా ప్రభావితం చేయడం మోసం కిందికి వస్తుంది. మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల్లో దేశంలోనే ఏడో అతిపెద్ద సంస్థగా యాక్సిస్‌ ఎంఎఫ్‌ ఉంది.
     ''ఒక షేర్‌ కోసం ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే ఎక్కువ ధరకు బిడ్‌లు వేయడం, బ్రోకర్‌తో తక్కువ అడగడం (అమ్మకం ఆర్డర్‌) జరుగుతుంది. దీంతో ఆ వ్యత్యాసాన్ని అక్రమంగా బ్రోకర్‌ నుంచి తిరిగిపొందడం. ఇందుకోసం బ్రోకర్‌, పుస్తకాల నుంచి నిర్వాహకులకు నగదు రూపంలో లేదా వస్తు రూపంలో తేడాను అందజేస్తాడు.'' ఇలాంటి చర్యలు సెబీ నిబంధనలకు విరుద్దం. ఆ విధంగా ఆర్జించిన మొత్తంతో ముంబయిలో పలు నివాసాలు కలిగి ఉండటంతోపాటుగా లిమిటెడ్‌ ఎడిషన్‌ లంబోర్గిని వాహనాన్ని కలిగిన ఓ ఫండ్‌ మేనేజర్‌పై ఎంఎఫ్‌ వర్గాల దృష్టి పడింది. ఆయనపై విచారణ చేసినట్లు సమాచారం.
     2022 ఫిబ్రవరి నుంచి సుమోటో విచారణ జరుగుతుంది. ''వీరి అవకతవకలపై ఆ ఎఎంసి బాహ్య అడ్వైజర్లతో విచారణ చేపట్టింది. ఆ ఇద్దరిపై విచారణ పెండింగ్‌లో ఉంది. అవకతవకలు జరిగాయనే ప్రాథమిక నిర్ధారణతో వారిని సస్పెండ్‌ చేశారు.'' అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వారు వెల్లడించారు. ఈ అక్రమాల్లో తమ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ చంద్రేష్‌ నిగమ్‌ ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలను ఆ సంస్థ కొట్టిపారేసింది. మార్కెట్‌ రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం నిర్ధారణ కాలేదు. వారికి మే 4న యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది. దీంతో యాక్సిస్‌ కన్సంప్షెన్‌, యాక్సిస్‌ బ్యాంకింగ్‌, యాక్సిస్‌ నిఫ్టీ, యాక్సిస్‌ టెక్నాలజీ లాంటి నాలుగు ఇటిఎఫ్‌ స్కీమ్‌లు, మరో మూడు ఫండ్స్‌ అయినా యాక్సిస్‌ ఆర్బిటేజ్‌ ఫండ్‌, యాక్సిస్‌ క్వాంట్‌ ఫండ్‌, యాక్సిస్‌ వ్యాల్యూ ఫండ్‌ల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న జోషి, అగర్వాల్‌ తొలగిపోయారని సమాచారం.