Jan 30,2023 21:31

అర్జీదారుని సమస్యను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

        పుట్టపర్తి అర్బన్‌ : ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ముఖ హాజరును తప్పనిసరిగా వేయాలని కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 166 వినతులను స్వీకరించారు. అనంతరం డిఆర్‌ఒ కొండయ్య, పుట్టపర్తి ఆర్డీవో భాగ్యరేఖతో కలిసి స్పందన అర్జీలు, గడపగడపకూ మన ప్రభుత్వం, సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ అటెండెన్స్‌, ఆయుష్మాన్‌ భారత్‌ తదితర అంశాలపై మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉద్యోగికీ ముఖ ఆధారిత హాజరు తప్పనిసరి చేసిందని, ఉద్యోగులందరూ ఎపిఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకుని తప్పకుండా ముఖ ఆధారిత హాజరు వేయాలన్నారు. రీ-సర్వే కార్యక్రమాన్ని సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ధేశించిన గడువు లోపల పూర్తి చేయాలన్నారు. స్పందన అర్జీలు బియాండ్‌ ఎస్‌ఎల్‌ఎ లోకి వెళ్లకుండా గడువులోగా పరిష్కరించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆయుష్మాన్‌ భారత్‌ ఈకేవైసీ పూర్తి చేయించాలన్నారు. సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ తప్పకుండా వంద శాతం వేయాలన్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంజూరైన పనులన్నీ గ్రౌండ్‌ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరుకుమార్‌, హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, డ్వామా పీడీ రామాంజనేయులు, పిఆర్‌ ఎస్‌ఈ గోపాల్‌ రెడ్డి, డిసిహెచ్‌ఒ తిపేంద్రనాయక్‌, చేనేత జౌళి శాఖ ఎడి రమేష్‌, డీఆర్డీఏ పీడీ నరసయ్య, ఇన్‌ఛార్జి డిఈఓ మీనాక్షి, ఆరోగ్యశ్రీ అధికారి యల్లప్పతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.