మతోన్మాద శక్తులను ఓడించాలి : సిపిఎం మహాసభల్లో సిపిఐ ప్రధాన క్యాదర్శి డి రాజా
కన్నూర్ : ఆర్ఎస్ఎస్ దేశానికి ప్రమాదకరమని, బిజెపి.. ఆర్ఎస్ఎస్ పాలనలో మత, కుల విభేదాలు పెచ్చుపెరుగుతున్నాయని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. సిపిఎం 23వ మహాసభల ప్రారంభ వేడుకలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ''వామపక్షాలు మాత్రమే ఆర్ఎస్ఎస్ను సైద్ధాంతికంగా సవాలు చేసి ఓడించగలవు. ఇందుకోసం సమాజంలోని అభ్యుదయ, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకం కావాలి. ఇతర లౌకిక, ప్రజాతంత్ర, ప్రాంతీయ పార్టీల సహకారంతో వామపక్షాలు ఆ పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మన చారిత్రక బాధ్యత అని మరువకూడదు'' అని అన్నారు.
''కుల వ్యవస్థ, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఆర్ఎస్ఎస్ను రాజకీయంగా, సైద్ధాంతికంగా ఓడించేందుకు అవసరమైన ఐక్యతను ఎలా సాధించాలనే దానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అక్టోబరులో జరిగే సిపిఐ మహాసభల్లోనూ, ఇప్పుడు జరుగుతున్న సిపిఎం మహాసభల్లోనూ ఈ అంశాలన్నింటిపైనా చర్చించాలి.'' అని రాజా పేర్కొన్నారు. వామపక్ష ఐక్యతకు, ఆర్ఎస్ఎస్-బిజెపి కూటమికి వ్యతిరేకంగా ప్రజా పోరాటానికి ఈ సభలు దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.










