మొరాయిస్తున్న ఆధార్ కేంద్రాలు
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆధార్ అప్డేట్ కేంద్రాలలో సేవలు పొందేందుకు ప్రజలు ఆయా కేంద్రాలకు వెళ్లగా నిత్యం మొరాయిస్తూ ఉండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం అల్లూరు నగర పంచాయతీ కార్యాలయం ఏర్పాటుచేసిన ఆధార్ సెంటర్ అక్కరకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 2 రోజుల నుండి తప్పులను సరి చేసుకునేందుకు ఆధార్ కార్డులు తీసుకురాగా కంప్యూటర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్నామని తెలియజేశారు. అక్కడ పనిచేసే సిబ్బందిని ప్రశ్నించగా ఇంగ్లీషులో కాకుండా అంతా హిందీలో అప్డేట్ అయిందని వెల్లడించారన్నారు. ఆధార్కార్డులో ఉన్న తప్పులను సరిచేసుకునేందుకు ఉచిత సేవలు పొందాలని వస్తే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. పోస్టల్, తదితరు ఆధార్ సెంటర్లో ఈ సేవలు ఉన్న చిన్న తప్పిదాలకు వందల్లో చెల్లించాల్సి వస్తుందని విచారం వ్యక్తపరిచారు.










