Nov 21,2023 00:28

మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అరెస్టు - మరో 30 మంది స్మగ్లర్లు -15 దుంగలు, వాహనాలు, గొడ్డళ్లు స్వాధీనం

మోస్ట్‌ వాంటెడ్‌ స్మగ్లర్‌ అరెస్టు
- మరో 30 మంది స్మగ్లర్లు -15 దుంగలు, వాహనాలు, గొడ్డళ్లు స్వాధీనం
ప్రజాశక్తి- తిరుపతి(మంగళం): ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్సు (ఆర్‌ఎస్‌ఏ ఎస్టీఎఫ్‌) ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వద్ద 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్‌ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. ఆయన సోమవారం టాస్క్‌ఫోర్సు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వీరి నుంచి 15 ఎర్రచందనం దుంగలు, 20గొడ్డళ్లు, 20 సెల్‌ఫోన్లు, టాటా కంపెనీ లారీ, బొలేరో వాహనంతో పాటు రూ.24వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్నూలు రేంజి డీఐజీ ఎస్‌ సెంథిల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు రాబడిన సమాచారంతో ఆర్‌ఎస్‌ఐలు వినోద్‌కుమార్‌, విశ్వనాథ్‌ టీమ్‌ ఆదివారం ఒంగోలు చేరుకున్నారు. ఒంగోలు- చీమకుర్తి రోడ్డు వద్ద సంతనూతలపాడు పోలీసుస్టేషను సమీపంలో తనిఖీలు చేస్తుండగా వీరిని గుర్తించినట్లు తెలిపారు. వీరిని చట్టుముట్టే ప్రయత్నం చేయగా కొందరు తప్పించుకున్నారని, 31మందిని పట్టుకోగలిగినట్లు చెప్పారు. పట్టుబడిన వారిలో ప్రధాన ముద్దాయి గుద్దేటి రామనాథ రెడ్డి (37) ఉన్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ ఇటు పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారుల కళ్ళుగప్పి తిరుగుతున్న మోస్ట్‌ వాంటెడ్‌ ఎర్రచందనం స్మగ్లర్‌ గుద్దేటి రామనాథరెడ్డిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఇతనిపై వివిధ పోలీసు స్టేషన్లలో 60కేసులు, నాలుగు ఎన్బిడబ్ల్యులు ఉన్నాయన్నారు. పూర్తివిచారణ అనంతరం రామనాథరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. డిఎస్పీలు చెంచుబాబు, మురళీధర్‌, ఆర్‌ఎస్‌ఐలు వినోద్‌ కుమార్‌, విశ్వనాధ్‌, సురేష్‌ బాబు, సిఐలు శ్రీనివాసులు, సురేష్‌ కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.