Jan 29,2022 08:13
  • కార్యక్రమమేదైనా ప్రచారానికి వాడుకుంటున్న ప్రధాని
  • రిపబ్లిక్‌ డే వేడుకల్లో 'ఉత్తరాఖండ్‌ టోపీ, మణిపూర్‌
  • కండువా' ఇందులో భాగమే..!
  • గతంలో అనేక సందర్భాల్లోనూ ఇదే తీరు : విశ్లేషకులు

న్యూఢిల్లీ : దేశమంతా జనవరి 26న 73వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపకుున్నది. ఇండియా గేట్‌ వద్ద నిర్వహించిన పరేడ్‌లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. అయితే, ఈ సందర్భంగా మోడీ వేషధారణ సాధారణానికి కాస్త భిన్నంగా కనిపించింది. ప్రతిసారి ఆయన తలకు తలపాగ ధరిస్తూ వచ్చేవారు. కానీ, ఇప్పుడు మాత్రం భిన్నంగా కనిపించారు. ఇది మీడియా దృష్టిని అతని వైపు మరల్చేలా చేసింది. కారణం.. ఆయన తలకు ధరించిన టోపి, వేసుకున్న కండువా. బ్రహ్మకమలం గుర్తు ఉన్న టోపీ ఉత్తరాఖండ్‌ సంప్రదాయానికి చెందినది కాగా, ఆయన వేసుకున్న కుండువా మణిపూర్‌కు చెందినది. అయితే, ఈ సందర్భంలో మోడీ వేషదారణ చర్చకు దారి తీసింది. అయితే, మోడీ చేసే ప్రతిచర్యలోనూ రాజకీయమే కనిపిస్తుందని విశ్లేషకులు తెలిపారు. ప్రస్తుత వేషధారణా ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు.
    వచ్చే నెల 10 నుంచి ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాతో పాటు కాంగ్రెస్‌ పాలిత పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీల ఎన్నికల ప్రచారాలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా, మోడీ అతిపెద్ద రాష్ట్రం యూపీ పైనే ఎక్కువ దృష్టిని పెట్టారు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పలు సభల్లో ఆయన పాల్గొన్నారు. అయితే, కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్‌, ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌కు మాత్రం ఆయన అంతగా సమయాన్ని కేటాయించడం లేదు. అయితే, ఇందుకు రిపబ్లిక్‌డేను వేదికగా వాడుకొని ఉత్తరాఖండ్‌ టోపీని, మణిపూర్‌ కండువాను ఆయన ధరించారని రాజకీయ విశ్లేషకులు వివరించారు. దేశ గణతంత్ర వేడుకల్లోనూ ఆయన రాజకీయాన్ని వదులుకోలేకపోయా రని ఆరోపించారు. తన పార్టీ ప్రచారం కోసం, ఆ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి రాజ్యంగబద్ధమైన ప్రధాని పదవిని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని విశ్లేషించారు.
    ఈ ఒక్క ఘటనే కాకుండా గతంలో పలు సందర్భాలలోనూ మోడీ ఇలాంటి 'ఎన్నికల స్టంట్‌'లు అనేకం చేశారని గుర్తు చేశారు. 2013లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా మోడీని ఆ పార్టీ ప్రకటించింది. అనంతరం అనేక రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తూ దేశమంతా కలియతిరిగారు. 2014 ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని గాంధీ నగర్‌ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోడీ.. తన పార్టీ గుర్తు అయిన కమలం బ్రూచ్‌ను ధరించి హైలెట్‌ అయ్యేలా చేశారు. ఆ కమలం గుర్తుతో సెల్ఫీ కూడా దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ఆ సమయంలో ఈ చర్యపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మోడీపై చర్యలు తీసుకోవాలంలూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని డిమాండ్‌ చేశాయి.
     చైనా అధ్యక్షుడు భారత్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోడీ వేషదారణనూ విశ్లేషకులు గుర్తు చేశారు. ఆ సమయంలో తమిళనాడు స్టైల్‌లో లుంగీ ధరించి మహాబలిపురంలో జిన్‌పింగ్‌తో కలియతిరిగారు. అయితే, బీజేపీ ని అంతగా ఆదరించని తమిళ ప్రజల మెప్పును పొందటం కోసమే మోడీ అలా చేశారని విశ్లేషకులు వివరించారు. అయితే, పాలనలో తాము చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని చూపెడుతూ ప్రజలను ఓట్లడగాల్సిన మోడీ, బీజేపీ పరివారం.. ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, వేషదారణను ఆయుధాలుగా వాడుకుంటూ ఓట్లను సాధించాలనుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇందుకు తమ ఆయుధం 'మతాన్ని' జోడిస్తూ ఎన్నికల అర్థాన్నే మార్చేస్తున్నాయని చెప్పారు.