Dec 31,2022 20:09

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

మెరుగైన వసతులు కల్పించాలి
ప్రజాశక్తి-ఆత్మకూర్‌ అర్బన్‌ : ఆత్మకూరులో నూతనంగా నిర్మాణం చేపడుతున్న మున్సిపల్‌ బస్టాండ్‌ వద్ద షాప్‌లు సంఖ్య తగ్గించి ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు, కౌలు రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి పేర్కొన్నారు. శనివారం వారు సిపిఎం నాయకులతో కలిసి మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.రమేష్‌ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్టాండ్‌ ప్రాంగణంలో ప్రజలకు, వాహనదారులకు, ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రణాళికా బద్ధంగా విస్తరణ నిర్మాణం చేయించాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.
అలాగే ప్రయాణికుల వస్తే గృహం నిర్మాణానికి సంబంధించిన కేటాయింపులు బిల్డింగు, ప్లాన్‌ ఆత్మకూరు కౌన్సిల్‌లో తీర్మానం జరిగిందా.. లేదా.. ఎంజిఆర్‌ ఫౌండేషన్‌కు మున్సిపాలిటీకి మధ్య ఏ ప్రతిపాదన ఒప్పందం జరిగిందో ప్రజలకు వివరించాలని సిపిఎం పట్టణ కమిటీ సందర్భంగా కోరినట్లు తెలిపారు. సమస్యలను వెంటనే పరిశీలించి ఆత్మకూరు ప్రజలకు నియోజకవర్గ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా ప్రయాణికుల వసతి గృహం నిర్మాణాలు చేపట్టవలసిందిగా కోరామన్నారు. అలా చేయని పక్షంలో ప్రజల పక్షాన సిపిఎం తరఫున ఆందోళనకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సంధాని, ఎపి రైతు సంఘం మండల అధ్యక్షులు కృష్ణమోహన్‌, ఆవాజ్‌ మండల ప్రధాన కార్యదర్శి పి.యస్థానిబాషా, రమణయ్య తదితరులున్నారు.