Jun 09,2023 21:32

మద్దతు ధరకే పసుపు కొనుగోలు - జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి

 అమర్‌నాథ్‌రెడ్డి
ప్రజాశక్తి-రాజంపేట రూరల్‌
ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు రైతులు పసుపును అమ్ముకోరాదని ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం రాజంపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో ఎపి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పసుపు పంట కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ రైతులను అన్ని విధాల ఆదుకొనడానికి ప్రభుత్వం నిరంతరం కషి చేస్తుందని తెలిపారు. ప్రస్తుత పసుపు పంటకు ప్రభుత్వం రూ.6850గా మద్దతు ధరను నిర్ణయించిందని పేర్కొన్నారు. పసుపు పంటను అమ్మాలనుకున్న రైతులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. పసుపు అమ్మాలనుకున్న రైతులు సిఎం యాప్‌లో ఇ-క్రాప్‌ ద్వారా పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపారు. పంటను నాణ్యత పరిశీలించి కొనుగోలు చేస్తామని మార్కెఫెడ్‌ జిల్లా మేనేజర్‌ త్యాగరాజు తెలిపారు. పసుపు పంటకు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించడంతోపాటు కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం పట్ల రైతులు తమ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి, రాజంపేట వ్యవసాయ శాఖ ఎడి, మార్కెట్‌ కమిటీ సెక్రటరీ, రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న అమర్‌నాథ్‌రెడ్డి