Jan 21,2023 21:16

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా రెవెన్యూ అధికారిణి నారాయణమ్మ

మైనింగ్‌పై ప్రజాభిప్రాయ సేకరణ
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఎస్‌జిఎస్‌ మినరల్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో మైనింగ్‌ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా శనివారం గ్రామంలో జిల్లా రెవెన్యూ అధికారిణి నారాయణమ్మ పర్యటించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మైనింగ్‌కు సంబంధించిన నిబంధనలు పరిస్థితులపై మైనింగ్‌ యాజమాన్యం తెలిపింది. అనంతరం గ్రామస్తులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ 129/పి సర్వేనెంబర్‌లో ఓపేన్‌ కాస్ట్‌ పద్ధతిలో 12.857 హెక్టార్ల విస్తీర్ణంలో క్వార్ట్‌ 12.165 టిపిఎ మైనింగ్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నందున సింగారెడ్డిపల్లి గ్రామంలో పంటలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, పశువులకు మేత దొరకడం కష్టంగా మారుతుదని ప్రజలు అధికారులకు తెలియజేశారు.
పర్యావరణ అనుమతులు, ప్రజాభిప్రాయ సేకరణను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని డిఆర్‌ఒ తెలిపారు. అనంతరం కొందరు పర్యావరణ ప్రేమికులు ప్రజలకు, అధికారులకు పర్యావరణ పరిరక్షణ సందేశాలను తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ శాఖ ఇఇ, తహశీల్దార్‌ షాజీయా భేగం, ఇఒపిఆర్‌డి భార్గవి, ఆర్‌ఐ శ్రీనివాసులు, విఆర్‌ఒ శ్యామ్‌, ఎన్‌జిఒలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.