ప్రజాశక్తి - ఆదోని
ఆదోని మండలం ఆరేకల్ గ్రామంలో ప్రభుత్వ మైనార్టీ ఐటిఐ కళాశాల ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదోని ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 'జగనన్నకు చెబుదాం, స్పందన'లో జెసి నారపురెడ్డి మౌర్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మైనార్టీ ఐటిఐ కళాశాల పనులు పూర్తయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా ప్రారంభించకపోవడం దారుణమన్నారు. పట్టణంలో ప్రభుత్వ ఐటిఐ కళాశాల లేక అనేక మంది విద్యార్థులు వేరే మండలానికి వెళ్లి అనేక ఇబ్బందులు పడుతూ చదువుతున్నారని తెలిపారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వెంటనే మైనార్టీ ఐటిఐ కళాశాల ప్రారంభించాలని, ఆదోనిలో ప్రీమిటిక్ బీసీ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను కలుపుకొని ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నాయకులు నాగరాజు, గౌస్, దినేష్ కుమార్, పవన్, సత్య పాల్గొన్నారు.
వినతిపత్రం ఇస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు