Feb 25,2022 08:48
  • సెన్సెక్స్‌ 2700 పాయింట్ల పతనం
  • రూ.13 లక్షల కోట్లు ఆవిరి
  • మదుపర్లు బెంబేలు

ముంబయి : ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో యుద్ద భీభత్సం నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు సూచీలను కుప్పకూలేలా చేశాయి. ఈ క్రమంలోనే భారత స్టాక్‌ మార్కెట్లు గత రెండేళ్లలో ఎప్పుడూ లేని స్థాయిలో పతనాన్ని చవి చూశాయి. గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేక చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలో రూ.8లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. సెన్సెక్స్‌ ఓదశలో 2,850 పాయింట్లు కోల్పోగా.. తుదకు 2,702 పాయింట్లు లేదా 4.72 శాతం క్షీణించి 54,529కి పడిపోయింది.
     ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 815 పాయింట్లు లేదా 4.78 శాతం నష్టపోయి 16,247కు పడిపోయింది. ఒక్క సెషన్‌లోనే రూ.13 లక్షల కోట్ల సంపద ఆవిరి కావడంతో మదుపర్లు లబోదిబోమంటున్నారు. బిఎస్‌ఇలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.255.68 లక్షల కోట్లు నుంచి 242.24 లక్షల కోట్లకు పడిపోయింది. దీంతో వరుసగా ఏడో సెషన్‌లోనూ మార్కెట్లు ప్రతికూలతను ఎదుర్కొన్నట్లయ్యింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు ప్రధాన నగరాలపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోందన్న వార్తలు మార్కెట్లను బెంబేలెత్తించాయి. రష్యా చర్యలకు ప్రతిచర్య తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ హెచ్చరికలు జారీ చేయడంతో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయో తెలియక మదుపరులు తమ పెట్టబడులు వెనక్కి తీసుకుంటున్నారు. యూరప్‌, ఆసియాలోని అన్ని స్టాక్‌ ఎక్సేంజీలు నష్టాలు చవి చూశాయి.
 

                                                                      అన్ని రంగాలు విలవిల

బిఎస్‌ఇలో స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు 5.77 శాతం చొప్పున క్షీణించాయి. ఐపిఒ స్టాక్స్‌ 6 శాతం నష్టపోయాయి. పేటియం సూచీ అమాంతం క్షీణించి రూ.781కి పడిపోయింది. ఇష్యూ షేర్‌ ధరతో పోల్చితే ఇది 64 శాతం తక్కువ కావడం గమనార్హం. సెన్సెక్స్‌-30లో ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. టాటా మోటార్స్‌ ఏకంగా 10 శాతానికిపైగా పడిపోయింది. ఇండుస్‌ఇండ్‌ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫినాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా సూచీలు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. దాదాపు అన్ని రంగాల సూచీలు 2-6 శాతం మేర పడిపోయాయి. రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, నాటో దళాలు కనుకు ప్రతిచర్యలకు దిగితే మార్కెట్లు మరింత పడిపోయ అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిటైల్‌ మదుపర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
    కాగా, గురువారం భారీ పతనంతో రూ.248.09 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం బీఎస్‌ఈ 30 షేర్ల సూచీ సెన్సెక్స్‌ 1800 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 స్టాక్స్‌ రెడ్‌ మార్క్‌లో ట్రేడవుతున్నాయి.
    ప్రతికూల మార్కెట్‌ సెంటిమెంట్‌ మధ్య మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్‌లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 576 పాయింట్లు, 804 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్‌ స్టాక్స్‌లో టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టెక్‌ మహీంద్రా ఇప్పటి వరకు అత్యధికంగా నష్టపోయాయి. ఈ నెల 16న నుంచి భారతీయ స్టాక్‌ మార్కెట్లలో గందరగోళం కారణంగా పెట్టుబడిదారులు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం రష్యా, ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధం వాతావరణం. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.