మా పోరాటానికి చిన్న విరామమిచ్చాం : సిఐటియు హర్యానా రాష్ట్ర అధ్యక్షురాలు సురేఖ
- మున్ముందు మరింత ఉధృతం చేస్తాం
- నిర్బంధాన్ని ఎదుర్కొని పోరాడుతున్న అంగన్వాడీలు
- స్ఫూర్తిదాయకంగా ఆశాల ఆందోళన
కన్నూరు (కేరళ) నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : అంగన్వాడీల డిమాండ్ల సాధన కోసం 190 రోజుల పాటు తమ రాష్ట్రంలో అవిశ్రాంతంగా నిర్వహించిన పోరాటానికి ఇప్పుడు చిన్న విరామమిచ్చామని హర్యానా రాష్ట్ర సిఐటియు అధ్యక్షురాలు సురేఖ తెలిపారు. 2021 డిసెంబరు 8 నుంచి ఈనెల 4 వరకూ ఆందోళన నిర్వహించామని ఆమె వివరించారు. 2018 మార్చిలో ప్రధాని మోడీ నిర్వహించిన 'మన్ కీ బాత్'లో అంగన్వాడీ వర్కర్లకు నెలకు రూ.1,500, హెల్పర్లకు నెలకు రూ.750 పారితోషికమిస్తామంటూ హామీనిచ్చారని గుర్తు చేశారు. తాము ఆయన చెప్పిన వాగ్దానాన్నే నెరవేర్చాలంటూ కోరుతున్నామని తెలిపారు. బెదిరింపుల్లో భాగంగా 951 మంది అంగన్వాడీలను విధుల్లోంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం 23వ అఖిల భారత మహాసభలో పాల్గనేందుకు కన్నూరుకు విచ్చేసిన సురేఖ ప్రజాశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇవీ.
- ఇళ్లకు తాళాలు.. నోటీసులు...
'హర్యానాలో అంగన్వాడీల డిమాండ్ల సాధన కోసం మొదట్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు), అంగన్వాడీ కార్యకర్త, సహయక్ యూనియన్ (ఎఐ టియుసి), అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (స్వతంత్ర)... కలిసి ఉద్యమించాయి. ఈ క్రమంలో అనేకసార్లు పికెటింగ్లు, రాస్తారోకోలు, ధర్నాలకు పిలుపునిచ్చాం. ఈ పోరాటం రోజురోజుకీ ఉధృతమవుతున్న తీరును పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం... అంగన్వాడీలపై తీవ్రమైన నిర్బంధం ప్రయోగించటం మొదలు పెట్టింది. వారి కుటుంబ సభ్యులను బెదిరించటం, ఇళ్లకు తాళాలేయటం, నోటీసులు అంటించటం, ధర్నాకు వెళ్లేందుకు వీల్లేకుండా అంగన్వాడీలను ఆటోల్లో ఎక్కించుకోవద్దంటూ ఆటోవాలాలను బెదిరించటం తదితర చర్యలకు పూనుకుంది. దీంతోపాటు మొబైల్ ఫోన్లు, వాటి సంభాషణలపై నిఘా ఉంచింది. ఇలాంటి తీవ్రమైన నిర్బంధం మధ్య కూడా వారు తమ డిమాండ్ల సాధన కోసం తెగించి పోరాడారు.
- ఒక సంఘం వెనకడుగు...
'మరోవైపు పోరాటం మొదట్లో కలిసొచ్చిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (స్వతంత్ర) ఆందోళన నుంచి తప్పుకున్నది. అయినా మిగతా రెండు సంఘాల ఆధ్వర్యంలో పోరాటాన్ని కొనసాగించాం. కాకపోతే 190 రోజులపాటు సుదీర్ఘంగా పోరాటం చేయటం, కుటుంబాల ఇబ్బందులు, వ్యవసాయ సీజన్ ప్రారంభం కావటం తదితర కారణాల వల్ల పోరాటానికి చిన్న విరామమిచ్చాం. మున్ముందు మరింత ఉధృతం చేస్తాం. విధుల్లోంచి తొలగించిన 951 మంది అంగన్వాడీలను తిరిగి తీసుకునేదాకా సర్కారును వదలబోం...'
- ఆశాలపై ఎస్మా...
'తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం ఉద్యమించిన ఆశాలపై హర్యానా ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించింది. వారివి అత్యవసర సేవలనే సాకుతో ఈ ప్రయోగానికి సర్కారు పాల్పడింది. వారందరూ ఒకేచోట పోగవ్వొద్దు.. సమావేశాల్లో పాల్గనొద్దంటూ ఆంక్షలు విధించింది. ఇలాంటి నిర్బంధాలను సైతం తట్టుకుని దాదాపు 26 వేల మంది ఆశాలు పోరాడుతున్నారు...'










