ఖాళీ బిందెలతో మహిళల నిరసన
ప్రజాశక్తి-ఉదయగిరి : మండల పరిధిలోని బిజ్జంపల్లి బిసి కాలనీలో గత పది రోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని శుక్రవారం రైతు నాయకులు కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాలనీలో ఉన్న బోర్లు చేడిపోవడంతో నీటి సమస్య తీవ్రమైందని రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో కొళాయి పథకంతో ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని హామీ ఇచ్చిన ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. రాత్రివేళ వీధి దీపాలు వెలగక అడవి ప్రాంతం కాలనీకి సమీపాన ఉన్నందున అడవి జంతువులు పాములు ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయని రాత్రులు బిక్కుబిక్కుమని నిద్రలేని రాత్రులు గడుపుతున్నామన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను తక్షణమే తీర్చాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిటిసి కాకు విజయ, మహిళలు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.










