పుట్టపర్తి అర్బన్ : జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద జిల్లాలో ఈ నెల 26 నుంచి జులై 16వ తేదీ వరకు చేపడుతున్న కుష్టు వ్యాధి నిర్ధారణ అవగాహన కార్యక్రమాన్ని బాధ్యతగా చేపట్టాలని కలెక్టర్ పి.అరుణ్ బాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో కుష్టువ్యాధి నిర్ధారణ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను డిఆర్ఒ కొండయ్యతో కలిసి విడదుల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి గుర్తింపు కోసం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శాఖ ఎఎన్ఎంలు, ఆశా వర్కర్లు గహ సందర్శన చేసి కుష్టు వ్యాధి లక్షణాలపై స్వీయ పరీక్ష చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాధి లక్షణాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్సలు అందించి మందులు అందజేస్తారన్న విషయాన్ని వారికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఒ డా||ఎస్వి.కృష్ణారెడ్డి, డిఎల్ఎటి తిప్పయ్య తదితరులు పాల్గొన్నారు.










