కత్తెర పురుగు నివారణపై అవగాహన
ప్రజాశక్తి-సీతారామపురం : మండలంలోని బసినేనిపల్లి రైతు భరోసా కేంద్రంలో శుక్రవారం మొక్కజొన్న పంటను ఆశించు కత్తెర పురుగు సమగ్ర సస్యరక్షణ పైన, కలుపు నివారణపై ఆత్మ డి.పి.డి. శివనారాయణ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ డి.విజరు కుమార్ నాయక్ కత్తెర పురుగు నివారణపైన రైతులకు అవగాహన కల్పించి 5 మంది రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం తరుపున కత్తెర పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు, వేపనూనె, కొన్ని రకాల పురుగు మందులను పంపిణీ చేశారు. అదేవిధంగా పంటల ఉత్పత్తి శాస్త్రవేత్త డాక్టర్ కె.కిరణ్ కుమార్ రెడ్డి కలుపు నివారణ పైన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు చెన్నా రెడ్డి, శ్రీనివాస్ చక్రవర్తి, గ్రామ వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.










