బెంగళూరు : కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మయిని కేంద్రం నియమించింది. బిజెపి కోర్కమిటీ ఆయన పేరును ఖరారు చేస్తూ.. తమ నిర్ణయాన్ని కేంద్రానికి పంపింది. బసవరాజ్ బొమ్మయి మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సన్నిహితుడు కావడం గమనార్హం. కేంద్రం పరిశీలకులుగా నియమించిన కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలు మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ఇన్చార్జ్ అరుణ్ సింగ్లతో పాటు యడియూరప్ప హాజరయ్యారు. కాగా, కొత్త సిఎం రేసులో రాష్ట్ర గనుల శాఖ మంత్రి మురుగేశన్ నిరాని, ఎమ్మెల్యే అరవింద్ బెల్లాట్, బసవరాజ్ బొమ్మయి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి. రవి, డిప్యూటీ సిఎం అశ్వథ్ నారాయణ్, కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, ప్రభుత్వ చీఫ్ విప్ సునీల్ కుమార్ పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే.