ప్రజాశక్తి - రాయచోటి టౌన్:క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పి హర్షవర్ధన్రాజు అన్నారు. సాయుధ పోలీస్ బలగాలకు రెండు వారాలపాటు నిర్వహించిన మొబలైజేషన్ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఆర్ పోలీస్ సిబ్బందికి ప్రతి సంవత్సరం మొబలైజేషన్ నిర్వహించి విధుల్లో నైపుణ్యం శారీరక దృక్పథం మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగాల్లో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. పోలీసులు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించడానికి వీలవుతుందని తెలిపారు. యోగా ధ్యానం, ఆర్థిక క్రమశిక్షణపై ప్రత్యేక తరగతులు నిర్వహించామని చెప్పారు. సిబ్బంది విధుల్లో నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని ఫైరింగ్, డ్రిల్, కవాతు, మాబ్ కంట్రోల్, ప్రముఖుల బందోబస్తు తదితర విధులు సమర్థవంతంగా ఎలా నిర్వహించాలో దిశా నిర్దేశం చేశారు. సిబ్బంది సంక్షేమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామని మొబలైజేషన్లో కీలకంగా విధులు నిర్వర్తించిన అధికారులు సిబ్బందికి ప్రశంస పత్రాలతో పాటు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ డాక్టర్ విబి రాజ్ కమల్, ఎఆర్ డిఎస్పి మెహబూబ్ భాష, ఆర్ఐలు మహబూబ్ అలీ, జావేద్ పెద్దయ్య, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.










