ప్రజాశక్తి-రాయచోటి : మానసిక, శారీరక దారుఢ్యానికి క్రీడలు దోహపడతాయని డిఎస్పి శ్రీధర్ అన్నారు. మంగళవారం జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర, వీఆర్డీఎస్ సంస్థ సంయుక్తంగా సాయి ఇంజినీరింగ్ కళాశాలలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలను డిఎస్పి శ్రీధర్, కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుధ్యానికి బాగా తోడ్పడుతాయని ఇటు మానసికంగా ఎదుగుదలకు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది టీంలు పాల్గొన్నాయి. గెలుపొందిన విజేతలకు డిఇఒ రాఘవరెడ్డి చేతుల మీదుగా సాయి కాలేజ్ టీంకు రూ.3 వేల నగదు బహుమతి, ద్వితీయ బహుమతిగా గాలివీడు ఆర్ఆర్ కాలేజ్ టీంకు రూ.2 వేల నగదుతో పాటు షీల్డ్, మెడల్స్, ప్రసంశాపత్రం అందచేశారు. అనంతరం డిఇఒ రాఘవరెడ్డి మాట్లాడుతూ క్రీడలతోనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడకారుల్లో చైతన్యం తేవడానికి నెహ్రూ యువకేంద్రం వారు ఈ క్రీడలు నిర్వహించడం అభినందదగ్గ విషయమన్నారు. వీఆర్డీఎస్ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి మాట్లాడుతూ నెహ్రూ యువకేంద్రం ప్రోత్సహంతో నేడు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఏంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తూ గ్రామీణ ప్రాంతాలకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారన్నారు. అనంతరం వీఆర్డీఎస్ సురేంద్రారెడ్డి, డిఇఒ రాఘవరెడ్డి, సాయి ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, సూర్య ఎడిటర్ నారాయణ, మాధురి స్కూల్ కరెస్పాండంట్ సుధాకర్లను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో నెహ్రూ యువకేంద్ర సిబ్బంది వెంకటేస్వర్లు, బాలాజీ, టోర్నమెంట్ ట్రైనర్ గౌస్, రామంజులు, ఫయాజ్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.










