
సీతానగరం : క్రీడల వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు అన్నారు. మండలంలోని డాక్టరు బిఆర్ అంబేద్కర్ గురుకులం, ప్రతిభ పాఠశాల, కెజిబివి విద్యాలయాల ప్రాంగణాల్లో రాష్ట్ర స్థాయి 67వ కరాటే పోటీలను గురువారం ఆయనతో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. క్రీడలు మానసిక వికాసానికి తోడ్పడతాయని పేర్కొన్నారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉందని ఆసక్తిగల క్రీడల్లో రాణించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు మన జిల్లాలో నిర్వహించడం ముదావాహమని అన్నారు. డిఇఒ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎన్.ప్రేమ్కుమార్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడు రోజుల పాటు అండర్ 14,17,19 బాలురు, బాలికలకు సంబంధించి రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 600 మంది క్రీడాకారులు, కోచ్లు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 14,17,19 సంవత్సరాలలోపు పాల్గొన్న బాలురు -బాలికలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ బాబ్జి, సర్పంచ్ కల్యంపూడి సింహాచలం, ఎంఇఒలు సూరి దేముడు, వెంకటరమణ, ప్రిన్సిపాళ్లు కె.ఈశ్వరరావు, పి.వెంకటనాయుడు, జె.సంధ్య, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పిడిలు, పిఇటిలు డిటి గాంధీ, ఎం.వాసుదేవరావు, మజ్జి రామకృష్ణ, మండంగి మురళి, ముప్పాళ శ్రీను, బలగ శ్రీరాములునాయుడు, తదితరులు పాల్గొన్నారు.