Jul 19,2021 20:15

న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌ కొత్తగా ఏడు కంపెనీలకు పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలకు వీలుగా అనుమతులను ఇచ్చింది. ప్రయివేటు రంగానికి పెద్ద పీట వేస్తున్న చర్యల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న కంపెనీలకు తోడుగా మరో ఏడు సంస్థలకు అనుమతులు జారీ చేసింది. 2019లో మార్కెట్‌ ఫ్యూయల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ నిబంధనల సడలింపుల ఆధారంగా ఈ అనుమతులు ఇచ్చిందని సమాచారం. పెట్రోల్‌, డీజిల్‌, సిఎన్‌జి గ్యాస్‌, ఇథనాల్‌ వంటి ఆటో ఫ్యూయల్స్‌ అమ్మేందుకు కొత్తగా అనుమతులు పొందిన కంపెనీల్లో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ మోలాసిస్‌ కంపెనీ (చెన్నై బేస్డ్‌), అస్సాం గ్యాస్‌ కంపెనీ, ఆన్‌సైట్‌ ఎనర్జీ, ఎంకె ఆగ్రోటెక్‌, ఆర్‌బిఎంఎల్‌ సొల్యూషన్స్‌, మానస్‌ ఆగ్రో ఇండిస్టీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు బల్క్‌, రిటైల్‌గా పెట్రోలు, డీజిల్‌ను అమ్మడానికి అనుమతి ఉంటుంది. అనుమతులు సాధించిన కంపెనీలు ఐదేళ్లలో కనీసం వంద పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్ర నిబంధన పెట్టింది.