కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలన్న దృఢ సంకల్పంతో, ప్రజల ఆశీర్వాదంతో కొనసాగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం శనివారం 41వ రోజుకు చేరుకుంది. పవనన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని అనంతరాయని ఏని పంటవీధి ప్రాంతాలలో పర్యటించి ప్రతి ఇంటికి జనసేన పార్టీ కరపత్రాలను పంచుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేశారు. ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను తెలుసుకొని జనసేన పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని నియోజకవర్గ ఇన్ఛార్జి నలిశెట్టి శ్రీధర్ భరోసానిచ్చారు. మున్సిపల్ పరిధిలో అనేక సమస్యలున్నాయని, ముఖ్యంగా డ్రెయినేజీ సౌకర్యం, వీధి దీపాల వంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సకల సౌకర్యాలతో ఆత్మకూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే ప్రజలందరూ జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, చంద్ర, నాగరాజు, ఆనంద్, భాను, హజరత్, తదితరులు పాల్గొన్నారు.










