కొండబిట్రగుంటలో 'ఫ్రైడే డ్రైడే'
ప్రజాశక్తి-బిట్రగుంట : బోగోలు మండలం కోవూరుపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొండబిట్రగుంట గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా మలేరియా అధికారిణి, కావలి డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ పి.బ్రిజిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఇంటింటికీ తిరిగి దోమల లార్వా సర్వేను, ఫీవర్ సర్వేను పరిశీలించి ఆరోగ్య సిబ్బందికి తగు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దోమల ద్వారా వ్యాపించే వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియాసిస,్ బోద వ్యాధి, జపనీస్ ఎన్ సెఫలైటిస్ చిన్న పిల్లలలో వచ్చే మెదడు వాపు వ్యాధి సోకకుండా ఉండాలంటే ప్రతిఒక్కరూ దోమలు కుట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టడం వల్ల వాటి నుండి దోమల వృద్ధి చెందుతాయని, ప్రతి శుక్రవారం ప్రతి ఇంటిలోని కంటైనర్లు, నీటి తొట్టెలు మొదలైన వాటిలో ఉండే నిల్వ నీటిని పూర్తిగా పారబోసి, వాటిని శుభ్రపరచి ఒక గంటసేపు ఎండలో ఆరబెట్టుకొని మళ్లీ తాజాగా నీటితో నింపుకొని వాటిపై పూర్తిగా మూతలు ఉంచుకోవాలని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలందరూ సహకరించి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి వెళ్లి అక్కడ అందించే వైద్య సేవలను పర్యవేక్షించారు. అత్యవసర వైద్య చికిత్స సేవలు అవసరమైన వారికి చేసిన ఏర్పాట్లు తనిఖీ చేసి తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి జి.రవికుమార్, ఆరోగ్య విస్తరణ షేక్ ఇలియాస్, ఆరోగ్య పర్యవేక్షకులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










