Apr 05,2023 21:25

మాట్లాడుతున్న డిఎస్‌పి

మాట్లాడుతున్న డిఎస్‌పి
కన్నకూతురిని హత్య చేసిన కసాయితల్లి
నెల్లూరు :నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలే కావడం.. భర్తతో విడిపోయి జీవిస్తుండటం...తనకు తోడుగా ఉంటున్న తల్లి లేని సమయంలో జన్మనిచ్చిన పిల్లల ఆలనా... పాలనా చూసుకోవడం కష్టంగా ఉండటమేకాక తన ఉన్నత చదువులకు, భవిష్యతుకు, ఎదుగుదలకు అడ్డుగా ఉందన్న అకారణంతో కన్నకూతురిని హత్యచేసింది ఓ తల్లి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగర డిఎస్‌పి శ్రీనివాసులరెడ్డి ఈ హత్యకు సంబంధించిన వివరాలు మీడియా ముందుంచారు. రెండు రోజుల క్రితం ఇంటిలోని ఊయలలో నిద్రిస్తున్న లక్ష్మి హారిక ఒకటిన్నర సంవత్సరం వయస్సు కలిగిన బాలికను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేసి ఊయలలో టిడ్డీ బేర్‌ బొమ్మను ఉంచారంటూ తల్లి కలుపూటి అనుష, భర్త మణికంఠ ఇద్దరు బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్నారు. ఎస్‌పి ఆదేశాల మేరకు నగర డిఎస్‌పి శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. బాలాజీనగర్‌ పోలీసులు మొదటగా కిడ్నాప్‌ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారన్నారు.
కేసు దర్యాప్తులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానమును ఉపయోగించిన పోలీసులు, అనుమానముతో పిర్యాదిని, పిర్యాదితో పాటు కొంతమంది వ్యక్తులను విచారించగా, ఆ విచారణలో పిర్యాది తనకు ఇద్దరు కుమార్తెలని, భర్తతో విడిపోయి జీవిస్తుండటం..తనకు తోడుగా ఉంటున్న తల్లి లేని సమయంలో జన్మనిచ్చిన పిల్లల ఆలనా... పాలనా చూసుకోవడం కష్టంగా ఉండటమేకాక తన ఉన్నత చదువులకు, భవిష్యతుకు, ఎదుగుదలకు అడ్డుగా ఉందన్న అకారణంతో కన్నకూతురిని ఇంటిలో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి వెనుక ఉన్న కాలువలో పడవేసి ఏమి తెలియనట్లు తిరిగి వచ్చి నిద్రపోయిందన్నారు. తెల్లవారిన తరువాత నా పాప కనపడుట లేదు ఎవరో పాప స్థానములో రెండు టెడ్డి బేర్‌ లు పెట్టి పాపని కిడ్నాప్‌ చేశారంటూ చుట్టు ప్రక్కల వారి దృష్టి మళ్ళించే విధంగా హైడ్రామా సృషించినట్లు .. తానే తన బిడ్డను కాలువలో వేసినట్లు అంగీకరించిందన్నారు. అంతట పోలీసువారు ఆమె ద్వారా, ఆమె పాపను కాలువలో పడవేసిన చోటును తెలుసుకుని ఈతగాళ్ళ సహాయముతో పాప మతదేహాన్ని బయటకు తీసి, ముద్దాయిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌ సిఐ నాయక్‌ పాల్గొన్నారు. ఈ కేసు విచారణలో ప్రతిభను కనపరిచిన ఎఎస్‌ఐ కె.వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్‌ కె.సుధాకర్‌, సిహెచ్‌ శివకుమార్‌, కానిస్టేబుల్స్‌ తిరుపతి, పి.పార్ధసారథి, తదితరులును అభినందించారు.