Nov 11,2023 22:22

కల్యాణ కట్టలో వేధింపులు మానుకోవాలి


కల్యాణ కట్టలో వేధింపులు మానుకోవాలి


తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి
పది రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే
టిటిడిఎడి బిల్డింగ్‌ ముట్టడి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌
తిరుమల కళ్యాణకట్టలో వేధింపులను మానుకోవాలని, కేఓడీ (కెప్ట్‌ ఆన్‌ డ్యూటీ)ని రద్దు చేయాలని తిరుపతిలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శనివారం తిరుపతి నగరంలోని యశోదానగర్‌ వేమన విజ్ఞాన కేంద్రంలో మేళ్ల చెరువు గంగులప్ప అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ తిరుమలలో పనిచేసే కళ్యాణకట్ట క్షురకులను టీటీడీ యాజమాన్యం వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. కళ్యాణకట్టలో 849 మంది క్షురకులు పని చేస్తున్నారని, కేఓడి పేరిట 49మందికి డ్యూటీలు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమన్నారు. సంవత్సర కాలంగా తొలగించిన వారు జీతభత్యాలు లేక అవస్థలు పడుతున్నారని, వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య మరికొందరు యాజమాన్యానికి అనుకూలంగా మాట్లాడటం దారుణమని విమర్శించారు. అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజులలో మహిళలను చేతులతో తాకటం, బట్టలిప్పి తనిఖీ చేయడం సిగ్గుచేటని అన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి వెంటనే స్పందించి తిరుమల కళ్యాణ కట్టలో పనిచేసే క్షురకులకు న్యాయం చేయాలని కోరారు. పది రోజులలో సమస్యను పరిష్కరించని పక్షంలో తిరుపతిలోని టీటీడీ ఎడి బిల్డింగ్‌ ఎదుట నవంబర్‌ 21వ తేదీ మంగళవారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.నాగరాజు మాట్లాడుతూ టీటీడీలో కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఎక్కడా లేని కేఓడి విధానాన్ని తిరుమల కళ్యాణకట్టలో పనిచేసే క్షురకులకు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. శ్రీవారి కళ్యాణకట్ట నాయిబ్రాహ్మణ సంఘం కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ క్షురకులను అదేపనిగా వేధిస్తున్నారని పలు ఘటనలను ఉదహరించారు. టీటీడీ యాజమాన్యం తమపై కక్ష కట్టడం అన్యాయమని కేఓడి విధానాన్ని రద్దుచేసి తొలగించిన పీస్‌రేట్‌ క్షురకులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాధాదేవి మాట్లాడుతూ తిరుమల కళ్యాణకట్టలో మహిళా క్షురకుల బట్టలిప్పి తనిఖీ చేయడం దారుణమని అన్నారు. ఇలాంటి ఘటనలు భారతదేశంలో ఎక్కడా జరగటం లేదని గుర్తుచేశారు. కేఓడి పేరుతో తొలగించిన కార్మికులను పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీ క్షౌరవత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగులప్ప మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి క్షురకుల సమస్యలపై పోరాడి అనేక హక్కులను, సాధించుకున్నామని గుర్తుచేశారు. బీసీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్రనేత బుట్టా సుధాకర్‌ యాదవ్‌, తిరుపతి అధ్యక్షులు సురేష్‌ నాయి బ్రాహ్మణ సంఘం నేతలు సదాశివం, బుజ్జి బాబు, సుధాకర్‌, శ్రీహరి, సుమతి ప్రసంగిస్తూ ప్రశ్నించిన వారిని ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమన్నారు. కళ్యాణకట్ట క్షురకుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, టి.సుబ్రహ్మణ్యం, నాగ వెంకటేష్‌, వేణుగోపాల్‌, చిన్నా, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి, జయంతి మద్దతు తెలిపారు.
క్షురకులను విధుల్లో తీసుకోవాలి..
తిరుమల కళ్యాణ కట్టలో పనిచేసే క్షురకుల తొలగించిన వారిని వెంటనే పని లోకి తీసుకోవాలని కోరారు. తమ తప్పులు ఏమీ లేకపోయినా కూడా కక్షగట్టి కేఓడి పేరుతో ఉద్యోగం నుంచి తొలగించడం అన్యాయమని బాధితులంటున్నారు. ఉద్యోగం నుంచి తొలగించిన వారిని పనిలో పెట్టుకోవాలని కోరుతూ కోర్టుకు వెళ్లిన వారిపై కూడా కక్ష సాధింపులు పేరుతో ఉద్యోగంలో తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇలాగైతే జీవనం సాగేదెలా అని ప్రశ్నిస్తున్నారు. కళ్యాణ కట్టలు పీస్‌రేటు క్షురకులు గత 12 నుంచి 15 సంవత్సరాలు పనిచేస్తూ అనుభవం కలిగిన వారు ఉన్నారు. భక్తులు నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా కూడా క్షురకులను చిన్న తప్పులు చేసిన కేఓడీ పేరుతో ఉద్యోగం నుంచి తీసి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏడాదిగా ఉద్యోగం లేదు..
- వనజ, కళ్యాణ కట్ట మహిళా క్షురకురాలు
నేను గత 13 సంవత్సరాలుగా తిరుమల కళ్యాణ కట్టలో పనిచేస్తున్నాను. గత ఏడాది కళ్యాణ కట్టలో ఓ భక్తురాలు కుమార్తెకు గుండు చేస్తుండగా చిన్న గీత పడింది, గుండు చేసుకోవడానికి ఆ చిన్న పాప ఏడవడం కదలడం వల్లే చిన్న గాయమైంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కేఓడీ పేరుతో నెలరోజులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఏడాది పాటు గడిచిన పనిలో తీసుకోలేదు. కోర్టును ఆశ్రయించడం వల్ల టిటిడి కళ్యాణ కట్టలు ఉద్యోగం ఎంతవరకు ఇవ్వలేదు, ఇలాగైతే మేము ఎలా బతకాలి. ఇప్పటికైనా టీటీడీ ఉన్నతాధికారులకు తమ న్యాయం చేయాలి.
యూనియన్‌ నాయకుడుగా
ఉండడం వల్లే ...
- ప్రసాద్‌, కళ్యాణ కట్టల పీస్‌రేట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి
కళ్యాణ కట్టలు పీస్‌ రేట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా ఉండటం వల్లే నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. నేను ఏ తప్పు చేయలేకపోయినా ఏడాది నుంచి ఉద్యోగం తొలగించారు. ఉద్యోగం జీతం లేక నానా ఇబ్బందులు పడుతున్నాను. ఉద్యోగం ఇవ్వాలని పలుమార్లు ఉన్నతాధికారులు కలిసినా వారు ఎటువంటి న్యాయం చేయలేదు. హైకోర్టును ఆశ్రయిస్తే టీటీడీ ఉన్నతాధికారులను కోర్టు కూడా తనను ఎందుకు తొలగించారనే కారణం చూపలేదు. తప్పులు చేసిన వారిని ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా యూనియన్‌ నాయకుడైన తనను ఉద్యోగం నుంచి తొలగించడం దారుణం. ఇప్పటికైనా నాకు ఉద్యోగం కల్పించే న్యాయం చేయాలి.
మొబైల్‌ లైట్‌ వెలుగులో గుండు చేశానని..
- సుమతి, కళ్యాణ కట్టలో మహిళా క్షురకురాలు
కళ్యాణకట్టలో విద్యుత్‌ లేకపోయినా నాపై ఒత్తిడి తెచ్చి వెంటనే గుండు చేయాలని భక్తులు కోరారు, అయినప్పటికీ నేను తిరస్కరించాను, గుండు చేయించుకోవడానికి ఎక్కువ గంటల సమయం ఇక్కడ వేచి చూస్తున్నామని భక్తులు బయట ఊర్లో వెళ్లాలని సమయం అవుతుందని చెప్పడంతో వారి మొబైల్‌ ఫోన్‌ టార్చ్‌లైట్‌ ఫ్లాష్‌ వెలిగించి గుండు చేయాలని కోరడం వల్లే నేను భక్తులకు గుండు చేయడం జరిగింది. దీని కారణంగానే కేఓడి పేరుతో ఉద్యోగం నుంచి తొలగించారు. జరిగిందాట్లో నా తప్పు ఏమీ లేకపోయినా నన్ను ఉద్యోగంలో నుంచి తొలగించడం అన్యాయం. టీటీడీ ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలి.