Jan 21,2023 20:55

పోలీస్‌ అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న న్యాయమూర్తులు

           ప్రజాశక్తి-హిందూపురం   కేసుల పరిష్కారానికి బ్యాంకర్లు, బీమా సంస్థలు, పోలీసులు, న్యాయవాదులతోపాటు అన్నివర్గాల వారు సహకరించాలని అదనపు జిల్లా జడ్జి శైలజ కోరారు. శనివారం స్థానిక ఎడిజె కోర్టు ఆవరణలో ఆయావర్గాలతో వేర్వేరుగా సన్నాహక మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల అధికారులతో పాటు మీడియా కూడా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. గతం కంటే అధికంగా ఈ మారు కేసుల పరిష్కారానికి బ్యాంకర్లు, భీమా సంస్థలు, పోలీసు శాఖ సహకరించాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సివిల్‌, చెక్‌ బౌన్స్‌ కేసులు, ప్రమాద బీమా కేసులు తదితర రాజి కాదగ్గ అన్ని రకాల కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మెగా లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు శ్రీధర్‌, స్పందన, రాజ్యలక్ష్మి, ఎపిపిలు ఇందాద్‌, నగేష్‌, ఎజిపి శ్రీనివాస్‌రెడ్డితో పాటు న్యాయవాదులు, వివిధ బ్యాంక్‌ల అధికారులు, సిఐలు, ఎస్‌ఐలు, బీమా సంస్థల అధికారులు పాల్గొన్నారు.