Jan 25,2023 19:40

కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

రాయచోటి : జిల్లా స్థాయి కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ గిరీష బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాల ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. విద్యార్థులలో క్రీడలను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి యూత్‌ ఐకాన్‌ వినరు కుమార్‌ను అభినందించారు. ప్రోగ్రామ్‌ ఆర్గనైజర్‌ వినరు కుమార్‌ మాట్లాడుతూ పట్టణం పరిధిలోని ఐకె పాఠశాల అవరణలో జిల్లా స్థాయి కబ్బడీ ఛాంపియన్‌ షిప్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 30వ తేదీన బాలురకు, 31న బాలికలకు పోటీలు నిర్వహించి వీటిలో ప్రతిభ చూపిన వారికి ఫిబ్రవరి 1వ తేదీన ఫైనల్‌ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలలో పాల్గొనే పాఠశాల టీములు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులకు వసతి, భోజనం ఉచితంగా కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పిఆర్‌టియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌రాజు, అర్చన విద్యా సంస్థల కరస్పాండెంట్‌ మదన్‌ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
-కబడ్డీ పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ గిరీష