Nov 06,2022 07:44
  • రాజ్యాంగం మనకు వివిధ చట్టాల ద్వారా చాలా హక్కుల్ని కల్పించింది. అయితే పొద్దున్న లేచించి మొదలు.. రాత్రి పడుకునే వరకూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. మన చుట్టూ జరిగే అనేక మోసాలు, దోపిడీలు, నేరాలు-ఘోరాలు వంటివి నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం.. మరీ ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలపై అనేక రకాలుగా హింస పెరిగిపోతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఎన్‌సిఆర్‌బి విడుదల చేసిన గణాంకాలను చూస్తే అర్థమవుతుంది. అయితే వీరిలో చాలామందికి న్యాయం అందడంలేదు. అవగాహన లేక కొందరు మిన్నకుండిపోతే.. అక్రమార్కులు, అరాచక శక్తుల ఆగడాలకు భయపడి మరికొందరు బాధితులుగానే మిగిలిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసు స్టేషన్లు, కోర్టుల్లోనూ అన్యాయం జరుగుతున్న దుస్థితి.. ఈ క్రమంలో రాజ్యాంగం మనకు కల్పిస్తున్న హక్కులను ఎలా పొందాలి..? తగిన న్యాయం.. రక్షణ కోసం ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి పరిమితమైన అంశాలపైనే ఈ నెల 9న 'న్యాయ సేవా దినోత్సవం' సందర్భంగా ప్రత్యేక కథనం..
  • సుప్రీం తీర్పులు : అనితకుశవహ వర్సెస్‌ పుషవ్‌ నుండాని 14-21లో పొందుపరచబడిన హక్కు 

చట్టం ముందు అందరూ సమానమే. పౌరులందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం జరగాలి. ఈ ప్రాథమిక సూత్రాలు రాజ్యాంగం యొక్క ఆదేశాలు. అనేక చోట్ల రాజ్యాంగంలో వీటి గురించి ప్రస్తావించబడింది. సమాజంలో పేద, బలహీన వర్గాలకు న్యాయ సహాయం అందించబడాలి. అది ఉచితంగా జరగాలి అని 39ఎ అధికరణ నిర్దేశిస్తుంది.

judicial
  • అందే సేవలు..

- న్యాయవాది సేవలు అందుతాయి. అనగా కోర్టులో కక్షిదారుని తరపున వాదనలు వినిపించబడతాయి. న్యాయ సలహాలు ఇవ్వబడతాయి.
- సముచిత కేసులలో కోర్టులో చెల్లించవలసిన ప్రాసెస్‌ రుసుము, సాక్షికి అయ్యే ఖర్చులు, కోర్టు వ్యవహారంలో ఆ కేసుకు అయ్యే ఇతర ఖర్చులు చెల్లించబడతాయి.
- కేసులో వాదనలు తయారుచేయడం. అప్పీలు దాఖలు చేయడం. కేసు కాగితాలు కోర్టులో దాఖలు చేసే విధంగా ఫైలు, పుస్తకాలు తయారు చేయడం. కాగితాలను అనువాదం చేయడం.
- వాదనలు లిఖితపూర్వకంగా తయారుచేయడం (డ్రాఫ్టింగ్‌)
- ధృవపరచబడిన తప్పులు, ఉత్తర్వులు, సాక్ష్యాలు చట్టపరమైన కాగితాలు అందించడం.

  • మహిళా బాధితులకు నష్టపరిహారం..

అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు వంటి విషయాలలో మహిళలపై దాడులు జరిగినప్పుడు వారికి గాని, వారి వారసులకు గాని నష్టపరిహారం చెల్లించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 'మహిళా బాధితుల నష్టపరిహార నిధి'ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. న్యాయ సేవా సంస్థల సూచన మేరకు తగిన మొత్తాన్ని ప్రభుత్వం మహిళా బాధితులకు చెల్లిస్తుంది. ఈ విధానంతో చెల్లించే నష్టపరిహారం ఇతర నష్టపరిహారాలకు సంబంధం లేదు. ఈ నష్టపరిహారం కోసం జిల్లాలో లేదా న్యాయసేవ సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ సంస్థలలో దరఖాస్తుల నమూనాలు లభ్యమవుతాయి. లైంగిక దాడులు జరిగినప్పుడు కూడా ఈ నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

  • వివిధ సేవా పథకాలు..

ఈ న్యాయ సేవా సంస్థల ద్వారా సమాజంలో వివిధ రకాలైన నిస్సహాయ వ్యక్తులు అనగా విభిన్న ప్రతిభావంతులు, బాలలు, వృద్ధులు, గిరిజనులు, ప్రకృతి వైపరీత్యాల బాధితులు, అసంఘటిత బాధితులు, నిరుపేదలు, మత్తు పదార్థాల బాధితులు మొదలైనవారి కోసం పథకాలు ఏర్పాటు చేయబడ్డాయి.

  • న్యాయ సహాయం ఏ దశ నుండి లభిస్తుంది?

న్యాయ సహాయం కేసుల ప్రారంభం నుంచి అనగా సివిల్‌ కేసుల్లో దాఖలు అయిన దగ్గర నుంచి సహాయం పొందవచ్చు. క్రిమినల్‌ కేసులలో ఎఫ్‌ఐఆర్‌ దాఖలు అయిన దగ్గర నుంచి అనగా అరెస్టుకు ముందు నుంచి పొందవచ్చు. అలాగే కేసు యొక్క అన్ని దశలలోను అనగా అప్పీలు, రివిజన్‌ దశలలో కూడా పొందవచ్చు.

  • ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?

సమస్య ఉన్న ప్రాంతాన్ని బట్టి, సమస్యలో ఉన్న విషయాన్ని బట్టి ఆయా (తమకు దగ్గర) తాలూకా / మండల స్థాయి న్యాయ సేవా అధికార సంస్థల వద్ద ప్రథమంగా దాఖలు చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా సాంకేతిక సమస్య వలన ఆ సంస్థకు పరిధి లేకపోతే వారి సూచన మేరకు తగిన సంస్థలో దాఖలు చేయాలి. ప్రతి స్థాయిలోను అనగా తాలూకా, జిల్లా స్థాయి న్యాయ సేవా సంస్థలు తాలూకా, జిల్లా కోర్టులలోనే స్థాపించబడి ఉంటాయి. కాబట్టి తమకు దగ్గరలో ఉన్న మండలంలో ఉన్న సంస్థను సంప్రదించడం ప్రథమ కర్తవ్యం. రాష్ట్ర స్థాయి సమస్యలు రాష్ట్ర న్యాయ సేవా సంస్థల వద్ద పేర్కొనాలి. ఇవికాక రాష్ట్ర హైకోర్టులో న్యాయ సహాయం కావలసి వస్తే హైకోర్టు స్థాయిలో ప్రత్యేక సేవా సంస్థ ఉంటుంది. దానిని సంప్రదించవచ్చు. సుప్రీం కోర్టులో కూడా ఇలాంటి సంస్థ ఉంటుంది. కనుక అక్కడా సంప్రదించవచ్చు.

  • లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ స్థాయిలో ఏ విధంగా వైద్య సహాయం అందిస్తాయో ఆ విధంగా గ్రామీణ ప్రజలకు, నిరక్షరాస్య, నిరుపేద ప్రజలకు న్యాయ సహాయం అందాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన పథకం లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌. ఈ విధానంలో సాధారణంగా ప్రతి ఆదివారం, బుధవారాలలో గ్రామాలలోని పంచాయితీలు లేక స్థానిక సంస్థల కార్యాలయాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేయబడతాయి. ఈ క్లినిక్‌లకు పారా లీగల్‌ వాలంటీర్లు, లీగల్‌ ఎయిడ్‌ న్యాయవాదులు హాజరవుతారు.
ఈ క్లినిక్‌లలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న న్యాయ సమస్యలు కాక, వీధి దీపాలు, రహదారులు, ఇళ్ళ స్థలాలు వంటి సమస్యలు.. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో కూడా సలహాలు ఇస్తారు. అక్కడే ఏవైనా నోటీసులు, జవాబులు, పిటీషన్ల తయారీ, దరఖాస్తులు మొదలైన విషయాలలో సలహాలు, సహాయం చేస్తారు. ఎక్కువ సహాయం అవసరమైతే న్యాయ సేవా అధికార సంస్థకు ఆ కేసును పంపిస్తారు. ఈ విధంగా సహాయం చేయడం ద్వారా కేసులు కోర్టుల దాకా రాకుండానే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు.

judicial

  • కుటుంబ హింస ఎదుర్కోవాలంటే..

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌ల నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కుటుంబ హింస 20-50 శాతం వరకూ ఉంది. 1946లో ఐరాస స్త్రీల స్థితిగతుల అధ్యయనం కోసం ఏర్పరచిన కమిషన్‌ నివేదిక ఆధారంగా 1979 డిశంబరు 18న ఐరాస ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దీనిని 'కన్వెన్షన్‌ ఆన్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఫామ్స్‌ ఆఫ్‌ డిస్‌ ఇంటిగ్రేషన్‌ ఎగైనెస్ట్‌ ఉమెన్‌' అంటారు. ఈ ఒప్పందం అమలు కొరకు ఏర్పరిచిన కమిటి 1992లో కొన్ని సిఫారసులు చేస్తూ మహిళలపై హింస, వివక్ష ఉన్నాయనీ వాటిని అరికట్టాలనీ తన సిఫార్సు నెం.19 లో పేర్కొంది.
మహిళలకు వ్యతిరేకంగా జరిగే హింస అంతమొందించేందుకు ఐరాస ప్రకటన 1993లో మొదటిసారిగా కుటుంబ హింసను నిర్వచించింది. ఈ నిర్వచనం మహిళలపై కుటుంబంలో జరిగే హింసను అన్ని కోణాల నుంచి నిషేధించింది. 1994లో మానవహక్కుల కమిషన్‌ ఏర్పాటు చేసిన కమిటి, 1995 బీజింగ్‌ అంతర్జాతీయ మహిళా సమావేశం రూపొందించిన ఉద్దేశ్యాలలో కూడా కుటుంబ హింస అరికట్టడం ప్రధానమైనది. అంతర్జాతీయ కుటుంబ హింసకు వ్యతిరేకంగా వచ్చిన ప్రకటనలు, ఒప్పందాలు, ప్రచారం ఫలితంగా 44 దేశాలలో కుటుంబ హింసకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి. మనదేశంలో కూడా మహిళా సంఘాలు, ప్రజాతంత్ర వాదుల ఒత్తిడి ఫలితంగా కుటుంబ హింస నుంచి మహిళల రక్షణ చట్టం-2005 వచ్చింది.
ఒక మహిళను ఆమె భర్తగానీ, అతని బంధువులుగానీ హింసిస్తే అది భారత శిక్షాస్మృతి 498ఎ కింద నేరం. సివిల్‌ చట్టాలలో కుటుంబ హింస గురించి పూర్తి ప్రస్తావన లేదు. ఈ చట్టాన్ని ప్రచారం చేసి, ఈ చట్టంలో భాగస్వామి కావటానికి స్వచ్ఛంద సంస్థలకు, రిజిస్టరు సొసైటీలకు అవకాశం ఉంది.

jeevana story judicial system
  • రక్షణ.. ఆర్థిక సహాయం..

ఈ చట్టం కేవలం చట్టబద్ధమైన వివాహితే కాక, వివాహాన్ని పోలి ఉన్న సంబంధాన్ని కలిగియున్న మహిళలకూ రక్షణ కల్పించింది. బాధితురాలు ఏవిధమైన సంబంధం అనగా ఉమ్మడి కుటుంబం ద్వారా ఏర్పడిన, రక్త సంబంధం ద్వారా ఏర్పడిన సోదరి, తల్లి, ఒంటరి మహిళలు ఎవరైనా రక్షణ పొందవచ్చు. వీరు న్యాయసేవల అథారిటీల చట్టం 1987 ప్రకారం ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. కుటుంబ హింస వల్ల బాధితురాలికి అయిన ఖర్చులు, నష్టపరిహారంగా ఆమెకు లేదా ఆమె పిల్లలకు తగినంత మొత్తాన్ని చెల్లించాలని హింసకు పాల్పడిన వ్యక్తిని మెజిస్ట్రేట్‌ ఆదేశించవచ్చు.

  • సహాయం ఎలా?

బాధితురాలు ఈ చట్టం ద్వారా సహాయం పొందుటకు మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ దరఖాస్తును బాధితురాలు స్వయంగా గానీ, రక్షణ అధికారుల ద్వారాగానీ లేదా ఆమె తరఫున మరి ఎవరైనాగానీ దాఖలు చేయొచ్చు. ఈ దరఖాస్తులో తనకు కలిగిన బాధను వివరిస్తూ తనకు కావాల్సిన సహాయాన్ని అర్థించాలి. ఈ దరఖాస్తు ద్వారా తనపై కుటుంబ వ్యక్తి నుంచి తగిన పరిహారం ఇప్పించమనీ కోరవచ్చు.

  • ఎన్నిరోజుల్లో పూర్తవుతుంది..

దరఖాస్తు అయిన తేదీ నుంచి సాధారణంగా మూడు రోజుల లోపల మేజిస్ట్రేట్‌ దరఖాస్తుల విచారణ ప్రారంభిస్తారు. విచారణ ప్రారంభమైన తేదీ నుంచి 60రోజుల లోపల పూర్తిచేసేందుకు మేజిస్ట్రేట్‌ ప్రయత్నిస్తారు.

  • ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం నేరం..

ఐపిసికి 2013లో వచ్చిన సవరణల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం సెక్షన్‌ 166 (ఎ) ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. నిర్ధిష్టంగా 354, 354ఎ, 345బి, 345సి(2), 345డి, 376(ఎ), 376బి, 376సి, 376డి, 376ఇ సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణించబడే సమాచారం అందినప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోతే నేరంగా పరిగణించడుతుంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల విషయంలో పోలీసుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకురావడం జరిగింది.

 

jeevana story judicial system
  • సంక్షేమ పథకాలు పొందడంలో..

కేవలం న్యాయపరమైన విషయాలు మాత్రమే కాక, ఏదైనా సంక్షేమ చట్టాలు ఉంటే వాటి ప్రకారం లబ్దిదారులకు రావాల్సిన ప్రయోజనాలను పొందే విషయంలో సలహాలు, సహాయాలు అందిస్తారు. అలాగే ప్రభుత్వ పథకాలు పొందడంలో కూడా సలహాలు, సహాయాన్ని అందజేస్తారు. ఆ విధంగా న్యాయాన్ని పొందడంలో కావాల్సిన సహాయాన్ని అందిస్తారు.

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఎలా?

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోదలచినవారు అaశ్రీఝ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు. కానీ ఇది జాతీయ స్థాయికి సంబంధించిన వెబ్‌సైట్‌. రాష్ట్రాలలో స్థానిక వెబ్‌సైట్‌లు ఉంటాయి. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.

  • ఫ్రంట్‌ ఆఫీస్‌ అంటే ఏంటి?

న్యాయసేవలు అందుబాటులో ఉండేందుకు న్యాయసంస్థల్లో ఏర్పరచిన గదిని 'ఫ్రంట్‌ ఆఫీసు' అంటారు. అన్ని న్యాయ సేవా సంస్థలు ఈ గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఈ గదిలోనే న్యాయవాదులు, పారాలీగల్‌ వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. ఈ గది సమర్థవంతంగా, నాణ్యతతో కూడి ఉండాలి. అంతేకాదు ఈ గది న్యాయ సహాయం కోరి వచ్చేవారికి అర్థవంతమైన న్యాయం అందించేలా ఉండాలి. వారిని ఆహ్వానించడం, ఫోన్‌లకు సమాధానం చెప్పడం, ఒక రికార్డును నిర్వహించడం, సమాచారాన్ని భద్రపరచడం, కోర్టు సమాచారాన్ని తాజా పరచడం మొదలైన పనులు ఈ కార్యాలయంలో నిర్వహించాలి.

  • న్యాయసేవా దినోత్సవం (లీగల్‌ సర్వీస్‌ డే)

మన దేశంలో ఉచిత, సమర్థవంతమైన న్యాయ సహాయం అందించేందుకు అధికార సంస్థలను ఏర్పాటు చేసి.. పేద, బలహీన వర్గాలకు న్యాయం నిరాకరించకుండా ఉండేందుకు చేయబడింది లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ చట్టం1987. ఇది నవంబర్‌ 9, 1995 నుంచి అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజు నుంచి 'న్యాయసేవ దినోత్సవం' జరుపుకుంటున్నాం.

  • దరఖాస్తు చేయడమెలా?

ఆ సంస్థలలో దొరికే ముద్రించి ఉన్న దరఖాస్తు ఫారాలను పూర్తిచేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటి కోసం దగ్గరలో ఉన్న న్యాయ సేవా సంస్థలను సంప్రదించాలి.

  • పూర్తిచేసిన దరఖాస్తును స్వయంగా అధికారులకు అందజేయవచ్చు లేదా పోస్టు ద్వారా కూడా పంపవచ్చు.
  • తెల్లకాగితంపై కూడా పూర్తి వివరాలు రాసి పంపవచ్చు. దానిలో చిరునామా, ఉద్యోగ వివరాలు, జాతీయత, ఎస్సీ, ఎస్టీ వర్తిస్తుందా, ఆదాయ వివరాలు, అఫిడవిట్‌ ద్వారా తెలపాలి. సమస్య వివరాలు, న్యాయసేవకు కారణాలు, మొత్తం వివరాలు రాసి, అధికారులకు అందించాలి. తగిన సాక్ష్యాలు కూడా సమర్పించవచ్చు.
  • మౌఖికంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వివరాలను పారాలీగల్‌ వలంటీరుకు లేదా ఏదైనా అధికారికి చెప్పవలసి ఉంటుంది. వారు దరఖాస్తు రాయడంలో సహాయపడతారు.
jeevana story judicial system
  • లోక్‌ అదాలత్‌..

కోర్టుకెళ్ళిన వారు కాటి కెళ్ళిన వారు ఒక్కటే.. అనే అభిప్రాయాన్ని తొలగించేందుకు వచ్చిన వ్యవస్థే లోక్‌ అదాలత్‌. ప్రాచీన కాలంలో రచ్చబండల దగ్గర పంచాయితీలు జరిపి, తీర్పులివ్వటం తెలిసిందే. సమాజం అభివృద్ధి చెందిన కొద్దీ న్యాయవ్యవస్థ కూడా క్లిష్టతరంగా మారి న్యాయం అందరికీ అందని పండుగా, ఖర్చుతో కూడినదిగా మారినది. ఈ లోపాలను సరిదిద్ది, త్వరితంగా తక్కువ ఖర్చుతో సామాన్య మానవుని ముంగిటకు న్యాయాన్ని తీసికెళ్ళేందుకు వచ్చిన ప్రక్రియ లోక్‌ అదాలత్‌.
లోక్‌ అదాలత్‌ అంటే 'ప్రజా కోర్టు' అని అర్థం. ఈ వ్యవస్థ గాంధేయ సూత్రాలపై ఆధారపడి ఉన్నది. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార వ్యవస్థలో ఇది ఒక భాగం. దేశంలోని అన్ని కోర్టుల్లో లక్షలాదిగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణ కోర్టులో కేసులు సంక్లిష్టంగా ఉండి, దీర్ఘకాలం కొనసాగుతున్నాయి. ఇలాంటి అపరిమిత జాప్యాన్ని తగ్గించటానికి లోక్‌ అదాలత్‌లను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థలో గెలుపు, ఓటములు ఉండవు. ఇరువురు కక్షదారుల అంగీకారంతో, అవార్డు మంజూరు చేస్తారు.

  • ఎక్కడ నిర్వహిస్తారు?

హైకోర్టు స్థాయి నుంచి కింది స్థాయి వరకు 30 కేసులు పరిశీలన కొరకు పంపిస్తే అప్పుడే లోక్‌ అదాలత్‌లు నిర్వహిస్తారు. ఈ లోక్‌ అదాలత్‌లు నిర్వహణ గూర్చి చాలా ముందుగానే ప్రభుత్వానికి సమాచారం పంపుతారు. అలాగే కేసులోని పార్టీలకు విచారణ తేది, సమయం మొదలైన వివరాలతో నోటీసు పంపుతారు.
సహజంగా లోక్‌ అదాలత్‌ను శని, ఆదివారాలు, సెలవు దినాలలో నిర్వహిస్తారు. ఇలాంటి అదాలత్‌ను పబ్లిక్‌ స్థలాలలో, కోర్టు ఆవరణ, ప్రభుత్వ గృహాలులాంటి బహిరంగ ప్రాంతాల్లో నిర్వహిస్తారు. లోక్‌ అదాలత్‌లో రెండు రకాలైన కేసులకు పరిష్కారం లభిస్తుంది. లోక్‌ అదాలత్‌ పరిధిలో.. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులను ఇరుపార్టీల అంగీకారంతో గానీ, ఎవరైనా ఒక కక్షిదారు లోక్‌ అదాలత్‌ ద్వారా ఈ సమస్యను పరిష్కరించి, సంతృప్తి చెందినప్పుడు అదాలత్‌ ద్వారా పరిష్కరిస్తుంది. కోర్టులే స్వయంగా ఒక సమస్యను అదాలత్‌ ద్వారా పరిష్కరించవచ్చు.
ఏ కేసైనా అదాలత్‌ పరిధిలోని ఏ కోర్టు దృష్టికి తీసుకురాకుండా ఉన్న కేసులను కూడా లోక్‌ అదాలత్‌ విచారణ జరిపి, సాధ్యమైనంత వేగంగా పరిష్కరించవచ్చు. ఈ విధానంలో న్యాయం, సమానత్వం, స్వచ్ఛత లాంటి న్యాయసూత్రాలను పాటిస్తుంది.

  • అధికారాలు..

- సివిల్‌ కోర్టులకు ఉన్న అన్ని అధికారాలు ఈ కోర్టులకు ఉంటాయి.
- ఎవరైనా పార్టీని, కోర్టుకు పిలవటానికి, విచారించటానికి అధికారం ఉంది.
- ఏదైనా డాక్యుమెంట్‌ను కోర్టులో అప్పగించమని అడిగేందుకు అఫిడవిట్లు ఆధారంగా సాక్ష్యాలను తీసుకొనేందుకు ఇతర సూచించబడిన అధికారాలు ఉంటాయి.
- రాజీతో మాత్రమే తీర్పులు ఇస్తారు.

  • ప్రయోజనాలు..

- ఈ విధానంలో కోర్టు ఫీజులుండవు. ఒకవేళ అప్పటికే కోర్టు ఫీజు చెల్లించి ఉంటే, లోక్‌ అదాలత్‌లో పరిష్కరించబడితే ఆ ఫీజు తిరిగి చెల్లిస్తారు.
- ఈ వ్యవస్థలో నియమావళి సరళంగా ఉంటుంది. విచారణ వేగంగా జరుగుతుంది. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, సాక్ష్యాధార చట్టాల నియమావళి మాదిరిగా సంక్లిష్టత ఉండదు.
- కేసులలోని కక్షిదారులు తమ న్యాయవాదుల ద్వారా న్యాయమూర్తులను నేరుగా కలిసే అవకాశం ఉంటుంది.
- లోక్‌ అదాలత్‌ల ద్వారా ఇచ్చే తీర్పుకు అప్పీలు ఉండదు. ఫలితంగా కేసులు దీర్ఘకాలం కొనసాగవు.

  • ఇదిచ్చిన తీర్పుపై అప్పీలు ఉండదా?

లోక్‌ అదాలత్‌లలో కేసులను ఇరు పార్టీల అంగీకారంతో ఇస్తారు. ఆ తీర్పును పునఃసమీక్ష చేయటం, పునరాలోచించాల్సిన అవసరం లేదు. లోక్‌ అదాలత్‌ ద్వారా వచ్చిన తీర్పే అంతిమం అవుతుంది. ఈ తీర్పుపై అప్పీలుకు అవకాశం లేదు. కక్షిదారులకు త్వరితంగాను, సరళంగాను న్యాయాన్ని అందించటమే ఈ విధానం లక్ష్యం అయినందున, ఇరు పార్టీల అంగీకారం ద్వారాను ఇచ్చినందున తీర్పుపై అప్పీలు ఉండకూడదని సెక్షన్‌ 21 (2) చెబుతుంది. 226 అధికరణం ద్వారా కూడా అవార్డు స్వచ్ఛతను ప్రశ్నించకూడదని, తద్వారా లిటిగేషన్‌ను చిన్నదిగా చేయాలన్న చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలని విశాఖపట్నం పోర్టు వర్సెస్‌ లోక్‌ అదాలత్‌, విశాఖపట్నం కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది.

  • ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే?

లోక్‌ అదాలత్‌లో సిఫారసు చేయబడిన ఏదైనా కేసు ఒప్పందానికి రాజీకి కుదరని పక్షంలో ఏ కోర్టునుంచైతే ఆ కేసు లోక్‌ అదాలత్‌కు వచ్చిందో ఆ కోర్టుకే తిప్పి పంపిస్తారు. ఒకవేళ ఈ కేసు ఏ కోర్టు దృష్టికి రానిదైతే ఆ ఇరువురు పార్టీలను కోర్టుకెళ్లే అవకాశాన్ని అదాలత్‌ కల్పిస్తుంది. మొదటి విధానంలో కోర్టుకు తిప్పి పంపించే కేసులో ఏ దశలో అయితే అదాలత్‌కు వచ్చిందో అదే దశ నుంచి తిరిగి విచారణ ప్రారంభిస్తారు. లోక్‌ అదాలత్‌ న్యాయసేవ సంస్థల చట్టం ప్రకారమే లోక్‌ అదాలత్‌లు కూడా నిర్వహిస్తారు.

jeevana story judicial system

 

 

 

- సురేష్‌కుమార్‌ పొత్తూరి, సుప్రీం కోర్టు న్యాయవాది
9849401041