న్యూఢిల్లీ : జనాభాను నియంత్రించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. జనాభా నియంత్రణ బిల్లును దేశ వ్యాప్తంగా తీసుకువచ్చేందుకు రాజ్యసభలో బిజెపి ఎంపి రాకేష్ సిన్హా , అనిల్ అగర్వాల్ కానీ ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే అసోం, ఉత్తరప్రదేశ్ల్లో ఇటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఈ నెల 19 నుండి పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. ఆగస్టు 6న ఈ అంశంపై సభ చర్చించనుంది. కాగా, ఇటు యుపిలో కూడా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సైతం ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నారు. దీని కోసం బిల్లును తీసుకురానుంది. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా 'యుపి జనాభా విధానం-2021-30'ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జనాభా పెరుగుదల అభివృద్ధికి ప్రతిబంధకమని అన్నారు. అసమానతలతో సహా అన్ని సమస్యలకు మూలకారణమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇది బిజెపి ఎన్నికల ప్రచారమంలో భాగమని సమాజ్వాదీ పార్టీ ఎంపి షక్ఫికూర్ రెహ్మన్ బార్క్ అన్నారు. జనాభాను నియంత్రించాలనుకుంటే వివాహాలను నిలువరించాలంటూ వ్యాఖ్యానించారు.










