ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్/పెద్దముడియం
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మంగ ళవారం రాత్రి పెద్దముడియం మండలంలోని సుద్దపల్లె గ్రామానికి చేరుకుంది. నాలుగు కిలోమీటర్ల మేర జిల్లాలో పాదయాత్ర సాగింది. జిల్లా టిడిపి యంత్రాంగం జమ్మల మడుగుకు చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బిటెక్ రవీం ద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు మల్లేల లింగారెడ్డి టిడిపి కార్యాలయంకు చేరుకుని మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జి భూపేష్రెడ్డితో కలిసి యువగళం పాదయాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువగళం పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గండికోట ముంపువాసులతో, రాజోలి ఆనకట్ట భూనిర్వాసితులతో, రైతులతో మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు సదస్సు, అనంతరం సెల్ఫీ కార్యక్రమం ఉంటుందన్నారు. జంగాలపల్లె, జె.కొట్టాలపల్లె, ఉప్పలూరు, బలపనగూడూరు, నెమలదిన్నే మీదుగా ఎన్.కొట్టాలపల్లెకు చేరుకొని అక్కడే బస చేస్తారన్నారు. 25 ఉదయం ఏడు గంటలకు పాదయాత్ర పెద్దపసుపల గ్రామ దాటుకుని జమ్మలమడుగు మండల పరిధిలోని రైల్వే వంతెన వరకు చేరుకొని పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తారు.










