Jul 22,2021 21:04

లక్నో: బాలిక జీన్స్‌ ధరించిన్న కారణంతో ఆమెను కుటుంబసభ్యులే హత్యచేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డోరియా జిల్లాలో తాజాగా చోటుచేసుకుంది. బాలికను కొట్టి చంపిన కుటుంబసభ్యులు తరువాత మృతదేహాన్ని వంతెనపై నుంచి నదిలో పడవేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో మృతదేహం రాత్రంతా వంతెన రెయిలింగ్‌కు వేలాడుతూనే ఉండడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే 17 ఏళ్ల బాలిక, తన తల్లి, ఇతర కుటుంబసభ్యులతో డోరియాలో నివసిస్తుంది. బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం పంజాబ్‌కు వలస వెళ్లాడు. బాలిక లైఫ్‌స్టయిల్‌పై కుటుంబసభ్యులు మొదటి నుంచి అసంతృప్తిగా ఉండేవారు. జీన్స్‌ ధరించినందుకు సోమవారం రాత్రి బాలికను ఆమె తాత, ఇద్దరు కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. దీంతో బాలిక స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లకుండా వంతెనపై నుంచి నదిలో పడేశారు. అయితే మృతదేహం వంతెన రెయిలింగ్‌కు వేళాడుతూ ఉండిపోయింది. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పోలీసులు, స్థానికులు కిందకు దించారు. బాలిక తాతను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగిలిన కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు.