జగనన్నకే 90శాతం ప్రజల మద్దతు
ప్రజాశక్తి-ఆత్మకూరుఅర్బన్ : రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జగనన్నే మా భవిష్యత్తు జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాలతో ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి వివరించి చేపట్టిన సర్వేలో 90శాతం ప్రజల మద్దతు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి, జెసిఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య అన్నారు. శనివారం జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి నేటితో ముగిస్తున్న సందర్భంగా ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు పట్టణ వైసిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం ఎంతో గర్వకారణమని తెలిపారు. రాష్ట్రంలో 1.45 కోటి కుటుంబాలను జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో కలిసినట్లు, అదేక్రమంలో ప్రభుత్వంపై వారి అభిప్రాయాన్ని తెలియజేసి ఫోన్ కార్యక్రమం ద్వారా 1.10 కోట్ల మంది స్పందించారని తెలిపారు. సచివాలయ కన్వీనర్లు గృహసారథులు పార్టీ ముఖ్యులు ఏడు లక్షల మందితో నిర్వహించిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగిందన్నారు. స్థానిక ఎంఎల్ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయా.. లేదా.. మీ సమస్యలేమిటి అని తెలుసుకొని వారి సమస్యలు వీలైన అంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలలో ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదని, భవిష్యత్తులో ఏ పార్టీ కూడా చేయలేని ఒక గొప్ప కార్యక్రమమని, ఈ సర్వే ద్వారా రాబోయే ఎన్నికలలో కూడా జగనన్న అఖండ విజయాన్ని సాధించడం తథ్యమని జగనన్న గెలుపును ఆపడం ఎవ్వరి తరం కాదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోపారం వెంకట రమణమ్మ, సిండికేట్ ఫార్మర్స్ సాసైటీ చైర్మన్.నాగులపాటి ప్రతాప్రెడ్డి, మాజీ ఎఎంసి చైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డి, వైస్ చైర్మన్.షేక్ సర్దార్, పార్టీ నాయకులు కొండా వెంకటేశ్వర్లు, జమీర్, అబ్దుల్లా, జమ్రు, మహబూబ్ బాషా, పూసల వెంకటరమణయ్య, తదితరులు పాల్గొన్నారు.










