ప్రజాశక్తి - పెనుగంచిప్రోలు
కొనకంచి గ్రామంలో నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకం లో మంజూరైన ఇళ్లను లబ్దిదారులతో కలిసి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో పూర్తి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కొనకంచి గ్రామంలో 144 మంది పేదలకు ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో సుమారు 50 శాతం మంది లబ్దిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారని, మిగిలిన వారు కూడా త్వరలోనే నిర్మాణం పూర్తి చేసుకోవాలని అన్నారు. జగనన్న ఇళ్లు పూర్తి చేసిన లబ్దిదారులకు సొంతంగా పది వేల రూపాయలు బహుమానంగా అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా మద్దికుంట్ల వెంకట్రావమ్మకు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కెడిసిసి బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, డైరెక్టర్ కొమ్మినేని రవిశంకర్, గ్రామ సర్పంచ్ గోనెల దేవి, సొసైటీ అధ్యక్షులు కాకుమాను శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










