జెవివి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలోని కూరగాయల మార్కెట్, (రైతుబజార్) వద్ద కావలి పట్టణ జనవిజ్ఞానవేదిక అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ.రవికుమార్, అధ్యక్షులు తోట.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముందుగా చిన్ని వెంకటరాజశేఖర్, వారి సతీమణి ఆలపాటి రాజేశ్వరి (మీనేస్తం స్వచ్ఛంద సంస్థ) దంపతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు వేసవి తాపం తీర్చుకో వడానికి కూల్ డ్రింక్స్ తాగడమే మార్గంగా భావిస్తుంటారని తెలిపారు. అలాగే గ్లామర్ ఉన్న సినీహీరో, హీరోయిన్లు చేసే అద్భుత విన్యాసాలతో కూడిన టివి, వ్యాపార ప్రకటనలతో చాలామంది మోసపోవద్దని, విషపూరిత రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ తాగుతూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దని తెలియజేశారు. శీతల పానీయాలు (కూల్డ్రింక్స్) తాగడం వల్ల స్థూల కాయం, కిడ్నీ, లివర్ సంబంధ వ్యాధులు, అధిక రక్తపోటు, దంత క్షయం, ఎముకలు పెలుసుబారి పోవుట, కేన్సర్, పురుషత్వలోపాలు, మధుమేహం వంటి వ్యాధులు సంభవించి ఆర్థికంగా నష్టపోతుంటారన్నారు. కంపెనీ కూల్ డ్రింక్స్ బదులుగా పండ్ల రసాలు, నిమ్మరసం, చెరుకురసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పానకం, గంజి, రాగి అంబలి, మొదలైన సహజ పానీయాలు సేవించడం ద్వారా ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, పీచుపదార్థం మొదలైన పోషక విలువలను శరీరానికి ఎంత ఆరోగ్యాన్నిస్తాయని తెలియజేశారు. కార్యక్రమంలో ట్రెజరర్ టి.సుబ్బరామశర్మ, ఉపాధ్యక్షులు పాపిశెట్టి. జానకిరామ్, కందికట్టు.నారాయణ, జె.వి.వి. సభ్యులు, ఈ కార్యక్రమానికి దాత చిన్ని వెంకట. రాజశేఖర్ (మీనేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ), జె.వి.వి. జాయింట్ సెక్రటరీ షేక్.ఖాదర్ భాషా, ఈ.సి. మెంబర్స్ జి.కళ్యాణి, వి.మల్లికార్జునరావు, ఎం.హరిచంద్రా రెడ్డి, లోక్అదాలత్ మెంబర్ ఎం.మాలకొండారెడ్డి, సీనియర్ జె.వి.వి. సభ్యులు గునకల. శివయ్య, కల్లయ్య, జాన్, తదితరులు పాల్గొన్నారు.










