ప్రజాశక్తి-పెడన : యేసుక్రీస్తు పునరుజ్జీవనానికి గుర్తుగా క్రైస్తవ సోదరసోదరిమణులు జరుపుకునే ఈస్టర్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ మరియు వారి సతీమణి శకుంతలమ్మ దంపతులు ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం పట్ల విశ్వాసానికి ఉన్న శక్తిని తెలిపిన మహిమాన్వితమైన రోజు ఈస్టర్ పండుగ అని మంత్రివర్యులు జోగి రమేష్ పేర్కొన్నారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని మంత్రి జోగి రమేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. క్రీస్తు అనుసరించిన ప్రేమ, దయ, శాంతి సహనం, త్యాగం వంటి విలువలు, శత్రువునైనా ప్రేమించమనే ఆదర్శం సమస్త మానవాళి అనుసరించదగినవి అని జోగి రమేష్ కొనియాడారు. ఈ పండుగ రోజు దేవుని దయతో అందరి హృదయాల్లో శాంతి, ఆనందాలు నిండాలని కోరుకుంటూ ,యేసుక్రీస్తు ఆలోచనలు మరియు ఆదర్శాలను మనం గుర్తుచేసుకోవాలని, క్రీస్తు మనకు బోధించిన న్యాయం మరియు కరుణ అనే అంశాలను పాటించాలని, సమాజంలో సంతోషం మరియు సోదరభావాల స్ఫూర్తిని పెంపొందించాలని జోగి రమేష్ మరియు శకుంతలమ్మ దంపతులు ఆకాంక్షించారు.










